తెలంగాణలో లేడీ ఫైర్బ్రాండ్ డీకే అరుణ.. వైసీపీకి బాసటగా నిలిచారు. సాయం చేయాలని ఆంధ్రా వైసీపీ నేతలు కోరితే.. అభయం ఇచ్చారు. నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన వంతు మద్దతు ఇస్తానని స్పష్టంచేశారు. అదేంటి నెల్లూరు జిల్లా రాజకీయాలకు, డీకే అరుణకు ఏంటి సంబంధం అని ఆశ్చర్యపోతున్నారా? మరి `రాజకీయాలు` అంటేనే అంత మరి!! ఈ విషయంపై పూర్తిస్థాయి క్లారిటీ రావాలంటే ఇది చదివి తీరాల్సిందే!
తెలంగాణలో డీకే అరుణ పేరు ఇప్పుడు మోరుమోగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ను ఢీకొట్టాలంటే నేతలు ఆలోచిస్తుంటే.. ఆమె మాత్రం ఏమాత్రం వెనుకంజవేయడం లేదు. నేరుగా కేసీఆర్తో ఢీ అంటే ఢీ అంటున్నారు. అయితే ఈ సమయంలో ఆమె ఆంధ్ర రాజకీయ నాయకులకు కూడా సాయం అందించేందుకు ముందుకొచ్చారు. ముఖ్యంగా వైసీపీ నేతలకు తనవంతు సాయం చేయబోతన్నారట. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు నెల్లూరులో రాజకీయ కాక పుట్టిస్తున్నాయి. వీటిని తెలుగుదేశం, వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
వాకాటి నారాయణ రెడ్డి తెలుగుదేశం తరఫున రంగంలోకి దిగితే.. వైసీపీ తరఫున ఆనం విజయ్కుమార్ రెడ్డి బరిలో నిలుస్తున్నారు. దీంతో ఇద్దరూ క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. ఈ విషయంలో టీడీపీ ముందంజలో ఉంది. టీడీపీ అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి తరపున చెన్నై శివార్లలోని హోటల్స్ లో క్యాంపులు నడుపుతున్నట్టు తెలుస్తోంది. అంత ఖర్చు పెట్టడం కష్టం కావడంతో వైసీపీ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఓ ప్లాన్ వేశారట.
తన వియ్యపురాలు డీకే అరుణకు విషయం చెప్పారట. అలాగే ఓ క్యాంపు నిర్వహించాలని కోరారట. దీనికి ఆమె అంగీకారం తెలపడంతో పాటు ఆమె గద్వాల్ దగ్గర శిబిరం ఏర్పాట్లు చేశారట. ఇప్పుడు వైసీపీ కి చెందిన నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధులు అక్కడే జేజమ్మ ఆతిధ్యాన్ని ఆస్వాదిస్తున్నారు. ఎన్నికల రోజు దాకా వారు గద్వాల లోనే బస చేస్తారట. ఏమైనా ఆంధ్రా రాజకీయాల్లోనూ తన పాత్ర పోషిస్తున్న జేజెమ్మ ధైర్యమే ధైర్యం..