ఆన్ లైన్ పైనే మోజు అందని ఫించన్లు

ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద జిల్లా వ్యాప్తంగా 3,86,826 మంది పింఛన్‌దారులు ఉన్నారు. ఆన్ లైన్ మోజులో ఆఫ్ లైన్ పై అధికారులు దృష్టి పెట్టడం లేదని విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి. పింఛన్ల పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం ట్యాబ్‌లు పంపిణీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సంకేతాలు (సిగ్నల్స్‌) అందకపోవడంతో పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సంకేతాలందే ప్రాంతాల్లో కార్యదర్శులు, సీసీలు కూర్చుని పింఛన్లు పంపిణీ చేయాల్సి వస్తోంది. సంకేతాలు సక్రమంగా అందకపోవడం, వేలిముద్రల సమస్యలతో ఒక్కో పింఛన్‌ అందించేందుకు 15 నిమిషాల వరకు పడుతోంది. మరికొన్ని చోట్ల రెండు, మూడు రోజుల పాటు నిరీక్షించాల్సి వస్తోంది. వీరిలో వృద్ధాప్య 2,00,778 మంది, వితంతు 1,19,042, వికలాంగ 55,572, చేనేత 11,240, కల్లుగీత పింఛన్‌దారులు 194 మంది ఉన్నారు.

గ్రామ పంచాయతీ కార్యదర్శులతో పాటు వెలుగు సీసీలు మొత్తం 1,261 మంది పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెలా 1–5లోపు పూర్తి చేయాలని ఆదేశాలున్నా అది సాధ్యం కావడం లేదు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా ఎక్కడా అమలు కావడం లేదు. దీంతో పాటు పింఛన్‌ పంపిణీ సిబ్బంది వేరే ప్రాంతాల నుంచి వస్తుండడంతో సకాలంలో ప్రక్రియ పూర్తి కావడం లేదు. వాస్తవానికి సంకేతాలు అందని ప్రాంతాల్లో ఆఫ్‌లైన్‌లో పంపిణీ చేసి, ఆ తర్వాత డేటాను ఆన్‌లైన్‌లో నమోదు చేసే అవకాశముంది.

ఈ విషయంలో చాలా మంది ఎంపీడీఓలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పైగా సకాలంలో పూర్తి చేయాలన్న నిబంధనతో చాలాచోట్ల పంచాయతీ కేంద్రంలోనే పంపిణీ చేపడుతున్నారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల వృద్ధులు, వికలాంగులు వ్యయ ప్రయాసలకోర్చి అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. కొన్ని పంచాయతీ కేంద్రాలు దూరంగా ఉండడం, రవాణా సౌకర్యాలు కూడా లేకపోవడంతో ఇలాంటి చోట్ల నరకయాతన అనుభవిస్తున్నారు. ఆగస్టుకు సంబంధించి 3,86,826 పింఛన్లు మంజూరవగా.. పంపిణీ చేసింది 3,63,926. అంటే 22,936 మందికి అందలేదు. మిగులు మొత్తం రూ.2,63,07,000. ఆగస్టులోనే కాదు.. ప్రతి నెలా ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది.