గుంటూరు జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి! ముఖ్యంగా రాజధాని ప్రాంతం కావడంతో అటు అధికార, విపక్ష పార్టీలు ఈ జిల్లాపై పూర్తిగా దృష్టిసారించాయి. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉండగానే.. ఎవరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు? ఎవరికి టిక్కెట్టు ఇస్తారు అనే చర్చ అప్పుడే మొదలైంది. క్రమశిక్షణకు మారుపేరైన సీఎం చంద్రబాబు.. ఇప్పటికే ఎవరికి టిక్కెట్ ఇవ్వాలనే అంశంపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం!
పార్టీకి చెడ్డపేరు తీసుకొస్తూ నిత్యం వివాదాలతో సావాసం చేస్తూ. . ప్రజల్లో అప్రతిష్ట మూట కట్టుకున్న నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈ సారి చుక్కెదురవుతుందని సమాచారం! వీరిలో మంత్రి రావెల కిశోర్బాబు, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్కుమార్, గుంటూరు-2 ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రకాష్ ఉన్నారని సమాచారం!
కొంత కాలం నుంచీ వివాదాలకు కేంద్రంగా మారిపోయారు రావెల కిశోర్బాబు! గుంటూరు జడ్పీచైర్పర్సన్ జానీమూన్ వ్యవహారం పార్టీకి ఇబ్బందులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే! అలాగే నియోజకవర్గంలోనూ తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఆయన వ్యవహారంపై అధినేతకు ఫిర్యాదు చేసినా.. కొత్తగా రాజకీయాల్లోకి రావడం, దళిత నాయకుడు కావడంతో ఉదాసీన వైఖరి అవలంబిస్తోంది.
అయితే రావెల వ్యవహారం ఇంకా క్లిష్టంగా మారుతుండటంతో ఇక ఆయనకు వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇవ్వడం కష్టమేనని సమాచారం! ఇక రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత సామాన్య ప్రజలను కానీ, పార్టీ కార్యకర్తలను కానీ పట్టించుకోవడం లేదట. ఉంటే హైదరాబాద్ లేకుంటే శ్రీలంకలో ఉంటారట. గత ఎన్నికల్లో టీడీపీ హవాతో గెలిచిన ఆయనకి ఈసారి టిక్కెట్ కష్టమేనని సమాచారం!
రాజధాని గ్రామాల ప్రజలను భూసేకరణకు ఒప్పించి చంద్రబాబుతో ప్రశంసలందుకున్నారు తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్కుమార్. అయితే ఇప్పుడు ఆయనపై సొంత పార్టీ నేతలే ఫైర్ అవుతున్నారు. టీడీపీకి అనుకూలంగా ఉండే ఓ సామాజికవర్గాన్ని పూర్తిగా దూరం ఉంచుతుండటంతో పాటు, సమస్యలపై తనను కలిసేందుకు వెళ్లిన వారిపై ఆయన మండిపడుతున్నారట. అంతేగాక తాను వైకాపాలో చేరతాననే అర్థం వచ్చిటేట్లు ‘మీరు ఓట్లు వేయకపోయినా…ఫర్వాలేదు…నాకు ఓటు వేసేవారు…వేరే ఉన్నారని’ అంటున్నారట.
ఇక గుంటూరు-2 ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్రెడ్డి టీడీపీలో పదేళ్లుగా టీడీపీలో ఉంటున్నా.. అంటీ ముటనట్టే వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అంతేగాక ఆయనకు వైసీపీ నాయకులతో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి! 2014 ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి ఆయన బావ దశరథరామిరెడ్డి వైకాపా నుంచి పోటీ చేస్తుండడంతో.. దశరథరామిరెడ్డి టీడీపీ తరఫున గుంటూరు-2 నుంచి ఎమ్మెల్యేగా పోటీచేశారు.
అప్పట్లో ఆయన తాను గుంటూరు-2కు వెళ్లనని భీష్మించడంతో పార్టీ అధికారంలోకి వస్తే మంత్రిని చేస్తామని హామీ ఇచ్చారని ఆయన చెబుతుంటారు. అంతేగాక మిర్చియార్డు ఛైర్మన్ పదవి తన సన్నిహితుడైన వెన్నాసాంబశివారెడ్డికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ అధిష్ఠానం ఆయన డిమాండ్ను పట్టించుకోకపోవడంతో తాను పార్టీ మారతానని సన్నిహితులతో చెబుతున్నారని సమాచారం. ఏదేమైనా ఈ నలుగురు సిట్టింగ్లకు 2019 ఎన్నికల్లో టిక్కెట్లు కష్టమే అన్న టాక్ గుంటూరు పాలిటిక్స్లో వినిపిస్తోంది.