వైకాపా అధినేత, ఏపీ విపక్ష నేత జగన్ కి మళ్లీ జైలు తప్పదా? ప్రస్తుతం ఆయన చుట్టూ మళ్లీ.. జైలు కథలు అల్లుకుంటున్నాయా? 2019 ఎన్నికల కన్నా ముందే ఆయన జైలుకు వెళ్లాల్సి రావడం ఖాయమా? అంటే ఔననే సమాధానాలే లోటస్పాండ్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. 2011లో కాంగ్రెస్ ను ఎదిరించి బయటకు వచ్చిన జగన్ అప్పటి నుంచి అనేక కేసులు ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఆయన తండ్రి వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు తెరచాటు వ్యవహారాల నేపథ్యంలో జగన్ లక్షల కోట్లు సంపాదించారని, ఆ డబ్బుతోనే సాక్షి, భారతి సిమెంట్స్, బెంగళూరులో ప్యాలస్ వంటి ఏర్పాటు చేసుకున్నాడని ముందు సీబీఐ తర్వాత ఈడీ వర్గాలు తేల్చి చెప్పాయి.
అయితే, అప్పట్లో తాను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినందునే తనపై కేసులు మోపి నానా యాగీ చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ జగన్కి.. జైల్లో ఉండాల్సి రావడం తప్పింది కాదు. అయితే, ఆ తర్వాత జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో బెయిల్నైతే సంపాయించుకోగలిగాడు. ప్రస్తుతం ఆయన ప్రతి శుక్రవారం నాంపల్లి కోర్టుకు వెళ్లి హాజరు అవుతున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్న స్టోరీ. కానీ, 2019 ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో జగన్ ఎపిసోడ్లో మార్పులు వేగంగా జరిగిపోతున్నాయని అంటున్నారు విశ్లేషకులు.
ప్రస్తుతం జగన్ కేసుల విచారణ నత్తనడకన సాగుతోందని, దీనిని వేగంగా విచారించి అక్రమార్కులకు శిక్ష పడేలా చేయాలని టీడీపీ నేత ఒకరు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసు వేగం పుంజుకుంది. ఈ నేపథ్యలో జగన్ ప్రధాన ఆర్థిక సంస్థలైన సాక్షి, భారతి సిమెంట్స్ ఆస్తులను ఈడీ అటాచ్ చేయడంతోపాటు, సైలెంట్గా ఆయా ఆస్తుల సొమ్మును తన అకౌంట్లోకి బదిలీ చేసింది. దీనిపై జగన్ మరోసారి కోర్టుకు ఎక్కారు. మరోపక్క, జగన్ కేసుల్లో చార్జ్ షీట్లను దాఖలు చేసే పనిని ఈడీ వేగవంతం చేసింది. ఇప్పుడిదంతా చూస్తుంటే.. రాబోయే ఏడు ఎనిమిది నెలల్లో జగన్ జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి రానుందని అంటున్నారు విశ్లేషకులు.
వాస్తవానికి ఇప్పుడున్న పొలిటికల్ పరిస్థితిని గమనిస్తే.. వైకాపా వచ్చే 2019 ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి రావాలని పెద్ద ఎత్తున స్కెచ్ సిద్ధం చేసుకుంటోంది. ఇది అధికార టీడీపీకి మింగుడు పడడం లేదు. పోనీ.. టీడీపీ తిరిగి అధికారంలోకి వస్తుందా? అంటే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని చంద్రబాబు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అవి చేరడం లేదు.
మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ సొంత వ్యవహారాల్లో మునిగి తేలుతున్నారు. కాపు ఉద్యమం ఉదృతం అవుతోంది. అనంత పురం వంటి చోట్ల అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో వైకాపాను అడ్డుకునేందుకు పరోక్షంగా జగన్ కేసుల విషయంలో వేగం పుంజుకునేలా చేశారని తెలుస్తోంది. ఇదే జరిగితే.. జగన్ 2019 కంటే ముందే జైలుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.