ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరికొత్త ట్విస్ట్

తెలుగుదేశంలో సీనియ‌ర్ నాయ‌కుల మధ్య‌ ఎమ్మెల్సీ వార్ ముగిసేలా క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే ఎవ‌రిని పెద్ద‌ల స‌భకు పంపాల‌నే విష‌యంపై క్లారిటీ రాలేదు. దీంతో ఆశావ‌హుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు బ‌డా పారిశ్రామిక వేత్త‌లు రంగంలోకి దిగారు. త‌మ‌కూ ఒక్క అవ‌కాశం ఇప్పించాల‌ని సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ చుట్టూ చ‌క్కెర్లు కొడుతున్నారు. ఇందుకోసం ఎంత‌యినా ఖ‌ర్చు చేసేందుకు సిద్ధ‌మ‌ని చెప్ప‌డంతో.. పార్టీలోని సీనియ‌ర్లలో గుబులు మొద‌లైంది. లోకేష్ వారిలో ఎవ‌రిపేర‌యినా ప్ర‌తిపాదిస్తే ఇక త‌మ ఆశ‌లు గ‌ల్లంతే అని వారు తీవ్రంగా మ‌థన‌ప‌డుతున్నార‌ట‌. మొత్తం కీ అంతా లోకేష్ చేతిలోనే ఉంద‌ని భావిస్తున్నార‌ట‌.

ఏపీలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అందులో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు అధికారపార్టీ అవలీలగా గెలుచుకుంటుంది. మరో స్థానం వైకాపాకు దక్కుతుంది. మరో స్థానంలో ఏ పార్టీకీ మెజార్టీ లేదు. ఆ సీటును తమకు ఇస్తే తప్పనిసరిగా విజయం సాధిస్తామని కొందరు కోటీశ్వర్లు పార్టీ ముఖ్యులతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. ముఖ్యంగా ఎమ్మెల్సీ ప‌ద‌వి ఆశిస్తున్న పార్టీ సీనియ‌ర్ నాయ‌కుల‌కు ఇది ఏమాత్రం రుచించ‌డం లేద‌ట‌, ముందుగా చినబాబును కలిసి ప్రసన్నం చేసుకుని.. ఆ తరువాత చంద్రబాబును కలిస్తే.. ఇక త‌మకు తిరుగు ఉండ‌ద‌ని పారిశ్రామిక వేత్త‌లంతా బ‌లంగా న‌మ్ముతున్నార‌ట‌. ఇందుకు గ‌తంలో అనుభ‌వాల‌ను నెమ‌రువేసుకుంటున్నారు.

గ‌తంలో ఎన్టీఆర్‌ హయాంలోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యేది. ముందుగా బాబును కలిసి త‌ర్వాత‌.. ఎన్టీఆర్‌ను క‌లిసేవారు. ఆ తరువాతే పెద్దాయన అభ్యర్థులను ఎంపిక చేసేవారు. అదే పద్దతి ఇప్పుడు కూడా నడిసే అవకాశాలు ఉన్నాయని టీడీపీ నాయకుల నమ్మకం. దీంతో పార్టీకి సానుభూతిప‌రులైన వ్యాపారులంతా చినబాబు చుట్టూ తిరిగి.. ప్ర‌సన్నం చేసుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డం.. సీనియ‌ర్ల‌కు మింగుడు ప‌డ‌టం లేద‌ట‌.

దీంతో సీనియ‌ర్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారని స‌మాచారం. కోట్ల‌ ముడుపులు ఇస్తే ఎమ్మెల్సీ పదవులు దక్కుతాయని వారు అంత‌ర్గ‌తంగా, స‌న్నిహితుల‌తో త‌మ ఆక్రోశం వెళ్ల‌గ‌క్కుతున్నార‌ట‌. అయితే ఇదంతా తెలిసిన వారు మాత్రం.. వీట‌ని కొట్టిపారేస్తున్నారు. ఇదంతా కావాలని కొంత మంది పార్టీ నాయకులతో పాటు విపక్షాలకు చెందిన నాయకులు.. పథకం ప్రకారం దష్రృచారం చేస్తున్నారని వాదిస్తున్నారు. చినబాబు అటువంటి వారిని దరిచేరనివ్వరని స్ప‌ష్టంచేస్తున్నారు. మ‌రి లోకేష్ ప్ర‌తిపాద‌న మేరకే సీట్లు కేటాయిస్తారో ఏమో వేచిచూడాల్సిందే!!