ఎర్రబెల్లి.. రమణల భేటీ.. మరోసారి రాజకీయ వేడి!

టీడీపీ తెలంగాణ అధ్య‌క్షుడు ఎల్ ర‌మ‌ణ‌, టీఆర్ ఎస్‌లో చేరిన మాజీ టీడీపీ నేత ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావులు భేటీ అయ్యారు. సాధార‌ణంగా ఏ పార్టీలోనో.. ఏ కార్య‌క్ర‌మంలోనే క‌లుసుకుని మాట్లాడుకుని ఉంటే.. ఇప్పుడు వీళ్లిద్ద‌రు పెద్ద‌గా వార్త‌ల్లో ఎక్కేవాళ్లుకారు! కానీ.. ఎర్ర‌బెల్లి స్వ‌యంగా ర‌మ‌ణ ఇంటికి వెళ్లి.. దాదాపు నాలుగు గంట‌ల పాటు భేటీ అయ్యారు. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య ఎలాంటి చ‌ర్చ‌లు న‌డిచాయి? ఇద్ద‌రూ త‌మ త‌మ రాజ‌కీయ వ్యూహాల‌కు సంబంధించి ఎలాంటి ముంద‌స్తు ప్లాన్‌తో ఉన్నారు?  2019 ఎన్నిక‌లకు రెండేళ్లే ఉన్న‌స‌మ‌యంలో ఈ ఇద్ద‌రు సీనియ‌ర్లు ఎందుకు అంత సేపు చ‌ర్చించుకున్నారు? వ‌ంటి అనేక సందేహాలు వ‌స్తున్నాయి.

నిజానికి ఎర్ర‌బెల్లి.. టీఆర్ ఎస్‌లో చేరి చాన్నాళ్లే అయింది. అయితే, ఆయ‌న అక్క‌డ మ‌న‌శ్శాంతిగా ఉండ‌డం లేద‌ని, ఆయ‌న‌కు త‌గిన గుర్తింపు కూడా టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఇవ్వ‌డం లేద‌ని టాక్ ఉంది. అదేస‌మ‌యంలో ఎల్ ర‌మ‌ణ ప‌ర‌స్థితి కూడా టీడీపీలో పెద్ద బాగోలేద‌ని, ఆయ‌న మాట‌కు ఎవ‌రూ విలువ ఇవ్వ‌డం లేద‌ని, ముఖ్యంగా సీనియ‌ర్ నేత‌గా, ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి సైతం ఎల్ ర‌మ‌ణకు చెప్ప‌కుండానే కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నార‌ని, దీంతో ర‌మ‌ణ.. నేను పార్టీ అధ్య‌క్షుడిగా ఉండి ఏంటి ప్ర‌యోజ‌నం అని అనుకుంటున్నార‌ని కొంద‌రు అంటున్నారు.

ఇక‌, మ‌రోకోణంలో చూస్తే.. ఇప్ప‌టికే సంఖ్యా బ‌లంగానే కాకుండా ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ ప‌రంగానూ టీడీపీ అంతంత మాత్రంగా ఉండ‌డంతో తాను కూడా పార్టీ మారి అధికార పార్టీలోకి జంప్ చేయ‌డ‌మే మంచిద‌ని ఎల్ ర‌మ‌ణ భావిస్తున్నార‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో ఎర్ర‌బెల్లి, ర‌మ‌ణ‌ల భేటీకి ప్రాధాన్యం సంత‌రించుకుంది.  ఎర్ర‌బెల్లి నేరుగా ర‌మ‌ణ ఇంటికే వెళ్లి నాలుగు గంట‌లు భేటీ కావ‌డం.. గ‌తంలోనూ ఇద్ద‌రూ చెట్టాప‌ట్టాలేసుకుని తిరగ‌డం వంటివి గ‌మ‌నిస్తే..ఇద్ద‌రూ పార్టీల ప‌రంగా ఏదో ఒక సిన్సియ‌ర్ డెసిష‌న్ సీరియ‌స్ డెసిష‌న్ తీసుకునే చాన్స్ ఉంద‌ని తెలుస్తోంది.