ఏపీలో వైకాపా మంత్రులు వీరే!

ఏంటి., ఆశ్చ‌ర్యంగా ఉందా? ఆలు లేదు చూలు లేదు.. అన్న‌ట్టు.. వైకాపా మంత్రులు ఏంటి?  పాలించ‌డం ఏంటి? అని నొరెళ్ల బెడుతున్నారా?  కానీ, ఇది నిజం. వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు.. త‌మ‌ను తాము మంత్రులుగా ఊహించుకుని మొన్నామ‌ధ్య భ‌లే ఎంజాయ్ చేసేశారు. మ‌రి ఆ స్టోరీ ఏంటో చూద్దాం. త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కు నిధులు ఇవ్వ‌డం లేద‌ని పేర్కొంటూ మొన్నామ‌ధ్య సీఎం చంద్ర‌బాబును క‌లిశారు వైకాపా ఎమ్మెల్యేలు. ఈ సంద‌ర్భంగా వెల‌గ‌పూడిలోని స‌చివాల‌యానికి వెళ్లిన  32 మంది  వైకాపా ఎమ్మెల్యేలు త‌మ స్టైల్లో అధికారంలోకి వ‌చ్చేసిన‌ట్టు ఊహించేసుకున్నారు.

త‌మ అధ్య‌క్షుడు జ‌గ‌న్ త‌ర‌హాలో తాము అధికారంలోకి వ‌చ్చేశామ‌ని, మంత్రులం అయిపోయామ‌ని వారు భ‌లేగా ఫీల‌య్యారు. ఒక‌రిద్ద‌రు.. తాము మంత్రుల‌మైతే.. ఎక్క‌డెక్క‌డ కూర్చుంటామో కూడా చెప్పుకొచ్చారు.   ‘మీరు మంత్రి అవ్వడం ఖాయం’ అంటూ ఒక‌ని ఒక‌రు పొగుడుకున్నార‌ట‌. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గిడ్డి ఈశ్వరి, ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితరులు మంత్రులు అవుతారని వీరు వ్యాఖ్యానించుకున్నారు. అంత‌టితో ఆగ‌కుండా.. వీరి పేషీల‌పైనా ఎమ్మెల్యేలు చ‌ర్చించుకోవడం ఆస‌క్తిగా మారింది.

ఇక‌, అత్యంత కీల‌క‌మైన స్పీక‌ర్ ప‌ద‌వి విష‌యంపైనా వైకాపా ఎమ్మెల్యేలు డిసైడ్ చేసుకున్నారు. ఎవ‌రు స్పీక‌ర్ ప‌ద‌విని చేప‌ట్టాలి? అని వారిలో వారు చ‌ర్చించుకుని.. నిర్ణ‌యించుకున్నారు కూడా. ఆ స్పీక‌ర్ అభ్య‌ర్థిని ఉద్దేశించి మీరు కూర్చునే కుర్చీ ఇక్కడ ఉంటుందంటూ ప్లేస్‌ను కూడా చూపించారు. ఇలా కాసేపు అధికారంలో ఉన్నట్టుగా ఊహించేసుకుని ఆనందపడిపోయారు. మ‌రోప‌క్క‌, తాత్కాలిక‌ స‌చివాల‌యం మొత్తం క‌లియ‌దిరిగి.. సెల్ఫీలు కూడా తీసుకున్నారు.

రికార్డు స‌మ‌యంలో స‌చివాల‌యాన్ని పూర్తి చేశారంటూ త‌మ అధినేత‌కు తెలియ‌కుండా బాబుకు కితాబు కూడా ఇచ్చారు.  హైదరాబాద్‌లోని స‌చివాల‌యంలా కాకుండా సువిశాల ప్రాంగణంలో సెంట్రల్‌ ఎయిర్‌ కండీషన్‌తో బ్రహ్మండమైన ఫర్నిచర్‌తో ఏర్పాటు చేశారంటూ గుసగుసలాడుకున్నారు. మొత్తానికి ఈ వైకాపా ఎమ్మెల్యేల సంభాష‌ణ ఆసాంతం హాస్యం పుట్టించింది!