ఏపీ కాంగ్రెస్ లో ఆమె ఒక్కరే మిగిలింది..!

కొన్ని ద‌శాబ్దాల నాటి ఆకాంక్ష‌ను ఒక్క క‌లం పోటుతో సాకారం చేసిన ఘ‌న‌తను సొంతం చేసుకున్న పార్టీ కాంగ్రెస్‌! ఇది తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు గొప్ప‌గా చెప్పుకొనేమాట‌! కానీ, అదే క‌లం పోటు.. అదే ద‌శాబ్దాల చ‌రిత్ర ఉన్న పార్టీని నామ రూపాల్లేకుండా చేసేసింది!! ఇది ఏపీ కాంగ్రెస్ నేత‌లు క‌ళ్లు తుడుచు కుంటూ చెబుతున్న మాట‌!! తెలంగాణ ఆకాంక్ష విష‌యంలో కాక‌లు తీరిన కాంగ్రెస్ నేత‌లు సైతం విభ‌జ‌న దిశ‌గా అడుగులు వేయ‌లేక‌పోయారు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించేందుకు ముందున్నామ‌ని చెబుతూ దాట‌వేశారే కానీ, తెలంగాణ ఇచ్చేందుకు ఏ ఒక్క‌రూ సాహ‌సించ‌లేక‌పోయారు.

కానీ, అనూహ్య ప‌రిణామాలు, వ‌ర్త‌మానాల నేప‌థ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. పార్ల‌మెంటు మొత్తాన్ని స్తంభింప‌జేసి.. చ‌రిత్ర‌తొలిసారి తీసుకున్న తెలంగాణ నిర్ణ‌యం.. కాంగ్రెస్‌ను మ‌రింత‌గా ముందుకు దూసుకుపోయేలా, ద‌క్షిణాదిలో కాంగ్రెస్‌కు ఎదురు లేకుండా చేస్తుంద‌ని విశ్వ‌నించారు కాబోలు! కానీ క్షేత్ర‌స్థాయిలోకి వ‌చ్చేస‌రికి అటు తెలంగాణ‌లో ఎలా ఉన్నా.. ఏపీలో మాత్రం హ‌స్తం పార్టీ అస్త‌వ్య‌స్త‌మైపోయింది. గ‌త ఎన్నిక‌ల్లో ఒక్కటంటే ఒక్క‌సీటును కూడా కాంగ్రెస్ ద‌క్కించుకోలేక పోయింది. అంతేకాదు, రానున్న 2019లోనూ పుంజుకునే వాతావ‌ర‌ణం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఇది ప‌క్క‌న‌పెడితే.. తాజాగా మ‌రో అవ‌మానాన్ని అతి పెద్ద జాతీయ పార్టీ కొంగున ముడేసుకోబోతోంది.

ఏపీ శాస‌న మండ‌లిలోని 58 మంది స‌భ్యుల్లో చాలా వ‌ర‌కు మే నెల‌లో ప‌ద‌వుల నుంచి వైదొల‌గ‌వ‌ల‌సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. వీరిలో కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వారే ఉన్నారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ ప‌క్షాన చైర్మ‌న్ చ‌క్ర‌పాణి, మండ‌లి ప‌క్ష నేత సీ రామ‌చంద్ర‌య్య‌, మ‌రో స‌భ్యురాలు ర‌త్న‌బాయి ఉన్నారు. వీరిలో చ‌క్ర‌పాణి, రామచంద్ర‌రావుల స‌భ్య‌త్వం ముగిసిపోనుంది. దీంతో ర‌త్న‌బాయి ఒక్క‌రే కాంగ్రెస్‌కు మిగులుతారు. పోనీ, కొత్త‌వారిని పంపుదామ‌న్నా.. కాంగ్రెస్‌కి అంత సీన్‌లేదు.

అసెంబ్లీలో ఉన్న ప్రాతినిధ్యం ఆధారంగానే మండ‌లి స‌భ్యుల కేటాయింపు ఉంటుంది కాబ‌ట్టి కాంగ్రెస్ పూర్తిగా అవ‌కాశం కోల్పోనుంది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్‌కు అటు అసెంబ్లీలోను, ఇటు మండ‌లిలోనూ స‌భ్యులు లేని విచిత్ర‌మైన ప‌రిస్థితి, ఎవ‌రూ ఊహించ‌ని స్థితి ఎదురు కానుంది. ఇదే విష‌యంపై రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ద‌శాబ్దాల ఆకాంక్ష‌ను తీర్చామ‌న్న ఆనందం ఏమోకానీ, రాష్ట్ర విభ‌జ‌న పాపం త‌మ‌ను చుట్టుకుంద‌ని వాపోతున్నారు. ఇదీ.. కాంగ్రెస్ ప‌రిస్థితి.