పశ్చిమగోదావరి జిల్లాకు గుండె కాయ వంటి ఏలూరులో టీడీపీకి ఎదురు లేదు. ఇక్కడి ఎంపీ మాగంటి బాబుకు ఎక్కడా లేని ప్రజాదరణ సొంతం. అయితే, ఇది నిన్నటి వరకు వినిపించిన మాట. కానీ, ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోయాయి. మాగంటి చెంబూ చేటా సర్దు కోవాల్సిన సమయం ఆసన్నమైందనే టాక్ వినిపిస్తోంది! అదేంటి? ఎందుకు? అని అనుకుంటున్నారా? విపక్షం వైకాపా అధినేత జగన్ గీసిన స్కెచ్ మహిమ అలా ఉందట! మాగంటికే కాకుండా పశ్చిమలో టీడీపీకి మంచి పట్టున్న ఏలూరులో పాగా వేయాలని జగన్ ఎప్పటి నుంచో భావిస్తున్నారు.
అయితే, గత ఎన్నికల్లో వైకాపా తరఫున బరిలో నిలిచి ఓడిపోయిన తోట చంద్రశేఖర్.. ఎక్కడా కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో మరో నేతకోసం ఎదురు చూస్తున్న జగన్కి అందివచ్చిన అవకాశం మాదిరిగా సీనియర్ రాజకీయ నేత కోటగిరి విద్యాధరరావు కుటుంబం నుంచి లభించిందట. ఆయన వారసుడు కోటగిరి శ్రీధర్ బాబు వైకాపాలో చేరిపోయారు. దీంతో జగన్ తన ప్లాన్ను అమలు చేయడం ప్రారంభించేశారట. టీడీపీ ఎంపీ మాగంటి బాబుకి చెక్ పెట్టేలా శ్రీధర్ను ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి జగన్ ఇంచార్జ్ చేశారు.
దీంతో ఇప్పుడు ఏలూరులో ఎక్కడ విన్నా.. మాగంటికి శత్రువు వచ్చాడు.. అంటూ జరుగుతున్న చర్చే వినిపిస్తోంది. పార్లమెంటు నియోజకవర్గం వైకాపా సమన్వయ కర్తగా శ్రీధర్ను నియమించాడు జగన్. దీంతో ఆయన తప్పకుండా మాగంటికి మొగుడుగా మారడం ఖాయమనే మాట వినిపిస్తోంది. గత ఎన్నికల్లో మాదిరిగా మాగంటికి గెలుపు నల్లేరుపై నడక కాబోదని అంటున్నారు.
దీనికి కారణం ఏంటంటే.. కోటగిరి కుటుంబానికి ఏలూరుతోపాటు దెందులూరు, పోలవరం, చింతలపూడి తదితర కీలక ప్రాంతాల్లో మంచి పట్టుందని, ఇది మాగంటికి మైనస్గా మారుతుందని చర్చలు నడుస్తున్నాయి. మరి మాగంటి ఎలాంటి ప్లాన్తో ముందుకు వెళ్తారోనని ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు.