మండలి ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ అధికార, విపక్షాలు శిబిర రాజకీయాలకు తెరతీశాయి. ముఖ్యంగా ప్రతిపక్ష అధినేత జగన్ సొంత జిల్లా కడపపై టీడీపీ ప్రత్యేకంగా దృష్టిసారించింది. దీంతో ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని ప్రతిపక్షం ఆరాటపడుతుంటే.. ఎలాగైనా పట్టు సాధించాలని అధికార పక్షం వ్యూహాలు రచిస్తోంది. ఇరు పక్షాల వ్యూహప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. ఇప్పుడు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పంట పండింది. తమ శిబిరాల్లోకి వచ్చే వారిపై కాసులు కుమ్మరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా రూ.40 లక్షల వరకూ బేరం వెళ్లిందటే ఆశ్చర్యం కలిగించక మానదు!
డబ్బు పెద్ద సమస్య కాదు… ఓట్లు కావాలి.. ఇప్పుడు దీనిని తూచ తప్పకుండా పాటిస్తున్నాయి రాజకీయ పార్టీలు. ముఖ్యంగా స్థానిక ప్రజాప్రతినిధుల నియోజకవర్గంలో ఓటర్లయిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు శిబిరాల్లోకి చేరుకునే కొద్దీ వారికి డిమాండ్ పెరుగుతోంది. బయట వున్న వారిని లాక్కునే ప్రయత్నంతో పాటు ప్రత్యర్థి శిబిరాల్లో ఉండే వారిని దగ్గర చేర్చుకొని మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. అధినేత చంద్రబాబే స్వయంగా వీటిపై దృష్టిపెట్టడంతో నేతలు తమ పట్టు నిరూపించుకు నేందుకు ప్రయత్నిస్తున్నారు.
దీంతో వైసీపీ కూడా అందుకు తగినట్టే వ్యూహాలు రచిస్తోంది. వైసీపీ శిబిరంలో జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన ఇద్దరిని టీడీపీ నాయకులను తీసుకురాగా.. తాజాగా మరో ఇద్దరు కమలాపురానికి చెందిన స్థానిక ప్రతినిధులను వైసీపీ శిబిరం నుంచి తీసుకురాగలిగారు. ఓటు విలువ లక్షలు పలుకుతుండడంతో ఏ పార్టీ నాయకులు ఎక్కువ మొత్తం చూపిస్తే, ఎంత ప్రయ త్నం చేస్తే ఆ మేరకు కొందరు స్థానిక ప్రతినిధులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. సంఖ్యాబలాన్ని 500కు చేర్చుకునే ప్రయత్నంలో టీడీపీ వుండగా, వైసీపీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ లోలోపల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
కాగా డిమాండ్ను బట్టి రూ.5 లక్షలతో మొదలైన బేరం 10కి చేరుతోందట. అంతటితో ఆగకుండా 15 లక్షలకు తాకింది. తాజాగా ఇద్దరు స్థానిక ప్రజాప్రతినిధులకు రూ.40లక్షల బేరం కుదిరినట్లు తెలుస్తోంది. మూడు రోజులుగా డబ్బులు పంపిణీ జోరుగా జరుగుతోంది. వంద ఓట్ల మెజారిటీతో గెలుస్తామని టీడీపీ నేతలు చెబుతుంటే.. 50 నుంచి 80 ఓట్ల మెజారిటీతో గెలుస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు.