కాటమరాయుడిపై `సర్దార్` బాధితుల పోరు

ప్ర‌జాక్షేత్రంలోని స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సేన అధినేత పవ‌న్ క‌ల్యాణ్ పోరాడుతుంటే.. ఇప్పుడు ప‌వ‌న్ పైనే యుద్ధం చేసేందుకు డిస్ట్రిబ్యూట‌ర్లు సిద్ధ‌మ‌వుతున్నారు. పెద్ద పెద్ద బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించి అటు కేంద్రంపై, ఇటు స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్న జ‌న‌సేనాని గురించి.. ఇప్పుడు అదే రీతిలో పోరుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటుచేసి త‌మ పోరాటాన్ని ప్రారంభించ‌బోతున్నారు. ప‌వ‌న్ సినిమా అంటే డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు పండ‌గే.. మ‌రి అలాంటి వారు ఎందుకు ఇలా అని ఆశ్చ‌ర్య‌పోకండి. ఇదంతా స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా గురించి!

2016లో వ‌చ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాన్ సినిమా.. సర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ పై అటు అభిమానులు ఇటు డిస్ట్రిబ్యూట‌ర్లు భారీ ఆశ‌లు పెట్టుకున్నారు. దీంతో కోట్లు ఖ‌ర్చు పెట్టి సినిమా హక్కులు పొందారు. తీరా సినిమా విడుద‌లై డిజాస్ట‌ర్‌గా నిలిచింది. దీంతో బ‌య్య‌ర్లకు తీవ్ర న‌ష్టాల్లో కూరుకుపోయారు. నైజాం డిస్ట్రిబ్యూటర్ ఇంద్ర ఫిలింస్ దాదాపు ఏడెనిమిది కోట్లు నష్టపోయారు. ఇప్పుడు వారంతా ఏక‌తాటిపైకి వ‌చ్చి ప‌వ‌న్‌పై పోరుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

ఆ సినిమా విడుదలకు ముందు చేసుకున్న అగ్రిమెంట్లలో.. తమ సొంత బాధ్యతపై సినిమా కొంటున్నామని, లాభనష్టాలతో తమకు సంబంధం లేదని నిర్మాతలు పవన్ కల్యాణ్, శరద్ మురార్ ముందుగానే సంత‌కాలు చేయించుకున్నార‌ట‌. అయినా సినిమా ఫ్లాప్ అయిన తరువాత.. రాబోయే సినిమా కాస్త తక్కువ రేట్లకు ఇస్తామని సర్ది చెప్పార‌ట‌. ఇప్పుడు ప‌వ‌న్ తాజా చిత్రం `కాటమరాయుడు` విడుదలకు ముస్తాబైంది. ఇప్పుడు మళ్లీ భయంకరమైన రేట్లకు అమ్మారు. అయితే నైజాం, కృష్ణా తదితర కొన్ని ఏరియాలు మాత్రం పాతవారికి ఇవ్వలేదు.

దీంతో వారు ఆందోళన బాట పట్టబోతున్నారట‌. ప్ర‌స్తుతం పవన్ మంగళగిరి సభ పనిలో బిజీగా ఉంటారని వెయిట్ చేస్తున్నారట. అప్పటికీ స్పందన రాకుంటే ప్రెస్ మీట్ పెట్టి త‌మ ఆదేద‌న‌ను జ‌నానికి వివ‌రించి.. పవన్ పై బహిరంగ పోరుకు సిద్దమ‌వ్వాల‌ని అనుకుంటున్నారట. సోమవారం లేదా మంగళవారం ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించార‌ట‌. చాంబర్ కు వెళ్లినా ప్రయోజనం వుండదని, ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పే పవన్ తమకు ముందు న్యాయం చేయాలని ప్రజాముఖంగానే ప్రశ్నిస్తామని ఓ సర్దార్ బాధిత బయ్యర్ అన్నారు.