కెసిఆర్ కి సిసలైన సవాల్!

రెండేళ్ల నుంచి అన్ని విషయాల్లో పైచేయి సాధించిన  టీఆర్ ఎస్ ప్రభుత్వం- ఎంసెట్ లీకేజీ, 8మంది వీసీల రద్దు తీర్పుతో ఇరుకునపడింది. ఎంసెట్ స్కాంతో ఓ పక్క గందరగోళం కొనసాగుతుండగానే  8మంది వీసీల నియామకాలు చెల్లవని హైకోర్టు తీర్పు ఇచ్చింది. వీటిని దెబ్బమీద దెబ్బగానే పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ప్రతిదీ నిశితంగా పరిశీలించి, నిఘాలతో ప్రభుత్వ వ్యవస్థను నడిపిస్తోన్న ప్రభుత్వం, ఎంసెట్ లీకేజీ అంశంలో దెబ్బతిన్నమాట నిజమేనని ఎమ్మెల్యేలు, నేతలు అంగీకరిస్తున్నారు.

ఎంసెట్ కుంభకోణం లక్షలాది విద్యార్థులు, వారి తలిదండ్రులకు సంబంధించిన సెంటిమెంట్‌తో ముడిపడి ఉండటం మరింత ఆందోళనకు కారణమైంది. దీనిపై ప్రతిపక్షాలన్నీ చెలరేగిపోతుండటం, విద్యార్థులు, తల్లిదండ్రులు సచివాలయం బయట, లోపల ఆందోళనకు దిగడం, ఏబివిపి వంటి విద్యార్థి సంఘాలు రోడ్డెక్కడం తెరాసకు ఇబ్బందికర పరిణామంగా మారింది. ఎంసెట్ రద్దు చేస్తే ఒక సమస్య, చేయకపోతే మరొక సమస్య ఉండటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. రద్దు చేస్తే 50 వేల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల దృష్టిలో ముద్దాయిగా నిలబడవలసి ఉంటుంది. రద్దుచేయకపోతే ప్రభుత్వ ప్రతిష్ఠ పూర్తిగా దెబ్బతింటుంది.

ఒకవేళ రద్దుచేస్తే విద్యార్థులు మానసిక ఉద్వేగానికి లోనయి, ఆత్మహత్యలకు పాల్పడితే అది మరో సమస్యకు దారితీస్తుంది. కోచింగ్ సెంటర్లకు లక్షలు పోసి ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్ధులు, మళ్లీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు మానసికంగా, ఆర్ధికంగా సిద్ధంగా లేరు. ఇప్పటికే మల్లన్నసాగర్ వ్యవహారంలో జెఏసి సహా విపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వాన్ని ఇబ్బందిపెడుతున్నాయి. కొత్తగా ఎంసెట్ లీకేజీ వ్యవహారం చేరడంతో, దాని నుంచి బయటపడే మార్గాలను అన్వేషిస్తోంది. మరో వైపు పుండు మీద కారం చల్లినట్లు యూనివర్శిటీలకు వీసీల నియామకంపైనా హైకోర్టు నుంచి చుక్కెదురు కావడం సర్కారును కలవరపెడుతోంది. వీటిపై కేసీఆర్ సరైన నిర్ణయం తీసుకుని, పార్టీ-ప్రభుత్వాన్ని ఇబ్బందుల నుంచి బయట పడేస్తారన్న నమ్మకం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.