ఏపీ సీఎం చంద్రబాబుకి విపక్ష వైసీపీ నేత జగన్ షాకుల మీద షాకులిస్తున్నాడు. ఇప్పటికే ప్రత్యేక హోదా శాంతి యుత యాత్ర ద్వారా విశాఖలో జరిగిన రగడ నేపథ్యంలో జగన్ పెద్ద ఎత్తున చంద్రబాబుకి షాక్ ఇచ్చాడు. విశాఖ విమానాశ్రయంలో నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేయడం జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక, ఇప్పుడు తాజాగా జేసీ దివాకర్ రెడ్డికి చెందిన బస్సు ప్రమాదం అంశం మరోసారి జగన్ని సెంటర్ ఆఫ్ది న్యూస్గా నిలబెట్టింది.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి నివాళులు అర్పించేందుకు, పరిస్థితిని సమీక్షించేందుకు స్పాట్ కి వెళ్లిన జగన్ పెద్ద ఎత్తున అక్కడ అధికారులపై ఫైరయ్యారు. దీనికి రీజన్ లేకపోలేదు. విపక్ష నేతగా ఆయన అడిగినప్పుడు పోస్ట్ మార్టమ్ కి సంబంధించిన వివరాలను అందించాల్సి ఉంది. కానీ, డాక్టర్లు, కలెక్టర్ సైతం విపక్ష నేతను ఖాతరు చేయలేదు. దీంతో రెచ్చిపోయిన జగన్.. కలెక్టర్పై విరుచుకుపడ్డాడు. ఇప్పుడు ఇదే వ్యాఖ్యలు అసలు విషయాన్ని పక్కదారి పట్టించాయి.
ఏపీ మంత్రి వర్గం, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ప్రమాదం ఘటనను పక్కకు తప్పించి.. కలెక్టర్పై జగన్ చేసిన కామెంట్లను పెద్ద ఎత్తున విమర్శించడం ప్రారంభించారు. నిన్న జరగిన కేబినెట్ భేటీలోనూ సీఎం చంద్రబాబు నేరుగా జగన్ వ్యాఖ్యలకు సంబంధించిన క్లిప్పింగులను మంత్రులకు చూపించారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా జగన్ వైఖరిని బాబు వర్గం పూర్తిగా ఖండించింది.
ఈ మేరకు ఓ తీర్మానం కూడా చేసేసింది. సో..మొత్తానికి ఓ ప్రతిపక్ష నేత వ్యాఖ్యలను నేరుగా కేబినెట్లో వీక్షించి మరీ తీర్మానం చేయడం ఇదే తొలిసారి. దీంతో జగన్ అంశం కేబినెట్లో దాదాపు గంటకు పైగా చర్చకు దారితీసినట్టు తెలుస్తోంది.