జగన్ కి సవాల్ విసిరిన టీడీపీ ఎంపి

వైకాపా అధినేత జ‌గ‌న్‌ని మ‌న‌వాడు.. మ‌న‌వాడు.. అంటూనే స‌టైరిక‌ల్‌గా విమ‌ర్శించే అనంత‌పురం ఎంపీ, టీడీపీ నేత జేసీ దీవాక‌ర్‌రెడ్డి మ‌రోసారి స్మూత్‌గా ఫైరైపోయారు. జ‌గ‌న్‌వి అన్నీ తాత‌బుద్దులేన‌ని, తండ్రి వైఎస్ బుద్దులు ఒక్క‌టి కూడా జ‌గ‌న్‌కి అబ్బ‌లేద‌ని అన్నారు.  క‌డ‌ప‌ జిల్లా పైడిపాలెంలో గండికోట‌ ఎత్తిపోతల ప‌థ‌కాన్ని బుధ‌వారం చంద్ర‌బాబు ప్రారంభించారు. అనంత‌రం బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా దివాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. వైకాపా అధినేత స‌హా ఎమ్మెల్యే గ‌డికోట శ్రీకాంత్ రెడ్డిపై తీవ్ర‌స్థాయిలో ఫైర‌య్యారు.

జ‌గ‌న్ తాత రాజారెడ్డికి తెల్లారిలేస్తే.. ఎవ‌రిని న‌రుకుదామా అనే ఉండేద‌ని.. అలాంటి మ‌న‌స్త‌త్వం జ‌గ‌న్‌కి వ‌చ్చింద‌ని విమ‌ర్శించారు. అంటే మళ్లీ గొడవలు రేపాలని చూస్తున్నాడని ఆయన విమర్శించారు. రక్తపాతాన్ని అందరూ మర్చిపోయారని, జగన్ మళ్లీ రక్తపాతం రేపేందుకు వస్తున్నాడని ఆయన చెప్పారు. ఈ నేప‌థ్యంలోనే ర‌క్త చ‌రిత్ర‌ నేచ‌ర్ ఉన్న శ్రీకాంత్ రెడ్డిని క‌డ‌ప జిల్లా ఇంచార్జ్‌గా నియ‌మించాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. ఇటీవ‌ల త‌న నాలుక కోసేస్తాన‌ని కామెంట్ చేసిన శ్రీకాంత్‌రెడ్డికి అంత ద‌మ్ముందా? అని ప్ర‌శ్నించారు.

“ఎవడ్రా వాడు శ్రీకాంత్ రెడ్డి? నా నాలుక కోస్తాడా? అరేయ్ నీ ఊరికి వస్తా. దమ్ముంటే నన్ను టచ్ చేయి చాలు” అంటూ నిప్పులు చెరిగారు. ఎవడో చెప్పిన మాటలు విని, నన్నే కామెంట్ చేస్తావా? అంటూ జేసీ మండిపడ్డారు. తనను జానీవాకర్ రెడ్డి అంటూ శ్రీకాంత్ రెడ్డి కామెంట్ చేయడంపై స్పందిస్తూ… మద్యం తాగడం తమ ఇంటావంటా లేదని చెప్పారు. తన గురించి మాట్లాడిన వారే జానీవాకర్లు అంటూ మండిపడ్డారు. తనకు బూట్లు నాకే అలవాటు లేదని… ఆ అలవాటు ఉంటే మంత్రి పదవిలో కొనసాగుతూనే ఉండేవాడినని జేసీ అన్నారు.

చీమంత‌ అనుభవం లేని వాడు కూడా తనను విమర్శించే ప్రయత్నం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ‘నా నాలుక కోస్తావా… అంత దమ్ముందా నీకు’ అంటూ నిప్పులు చెరిగారు. అయితే, ఇదంతా చంద్ర‌బాబు పాల్గొన్న స‌భా వేదిక‌పైనే జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. చివ‌రిగా.. 2019 ఎన్నిక‌ల్లో పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని జేసీ పిల‌పునివ్వ‌డం గ‌మ‌నార్హం.  మొత్తానికి వైకాపా అధినేత సొంత ఇలాకాలోనే ఇలా ప్ర‌తివిమ‌ర్శ‌లు తార‌స్థాయిలో చేర‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.