పవర్స్టార్ పవన్కళ్యాణ్ జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం కన్ఫార్మ్ అయ్యింది. జనసేన ఏపీ, తెలంగాణలో పోటీ చేస్తుందని పవన్ ప్రకటించాడు. ఇంకాస్త ముందుడగు వేసి ముందస్తు ఎన్నికలకు సైతం తాము సిద్ధమని పవన్ ప్రకటన చేశాడు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఏపీలో ట్రయాంగిల్ ఫైట్కు అదిరిపోయే రంగం సిద్ధమైంది. జనసేన నుంచి పోటీ చేయాలనుకుంటున్న వాళ్లు, అధికార టీడీపీ, విపక్ష వైసీపీ నుంచి టిక్కెట్లు దొరకడం కష్టమని భావిస్తోన్న వాళ్లు జనసేన నుంచి ఎన్నికల బరిలో నిలవాలని ఉవ్విళ్లూరుతున్నారు.
ఇక రాజకీయ పార్టీలు, రాజకీయ విశ్లేషకులు ఎవరికి వారు జనసేన ప్రభంజనంపై రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. ఇటీవల సర్వేల కింగ్ అయిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజ్గోపాల్ సర్వేలో జనసేన ప్రభావం అంత ఉండదని స్పష్టమైందన్న వార్తలు లీక్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఏపీ, తెలంగాణలో పలువురు ప్రముఖులు జనసేనలోకి జంప్ చేసేందుకు రెడీగా ఉన్నారన్న వ్యాఖ్యలు, గుసగుసలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి.
ఈ లిస్ట్ తెలంగాణలో కాస్త తక్కువుగా ఉన్నా ఏపీలో మాత్రం చాలా పెద్దగానే కనిపిస్తోంది. మంత్రి పదవి రాలేదన్న కోపంతో ఉన్న విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు జనసేన గూటికి జంప్ చేసేందుకు రెడీగా ఉన్నారట. ఆయన వచ్చే ఎన్నికలకు కాస్త ముందుగా జనసేనలోకి జంప్ చేస్తారని టాక్.
ఇక తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ రూటు కూడా జనసేన వైపే ఉందట. ఆయన ఇటీవల పార్టీ వ్యవహారాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నాడట. ప్రముఖ సినీ నటుడు సుమన్ కూడా రాజకీయాల్లోకి వస్తానని మొన్ననే ప్రకటించారు. ఆయన చూపు కూడా జనసేన వైపే ఉంటుందని చెబుతున్నారు.
టీడీపీలో ప్రయారిటీ లేదని ఫీలవుతున్న ఆనం వివేకానందరెడ్డి, చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు పేర్లు సైతం జంపింగ్ లిస్టులో వినవస్తున్నాయి. ఇక తెలంగాణలో నితిన్ జనసేన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెప్పుకుంటున్నారు. అలాగే ప్రజాయుద్ధనౌక గద్దర్ పవన్ చెంత చేరతారంటున్నాయి. ప్రొఫెసర్ కోదండరాం పార్టీతో జనసేన పొత్తు ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా జనసేనలోకి చాలా మంది ప్రముఖులు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.