జనసేన అధినేత పవన్ తన దూకుడును స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు ట్వీట్లు, కామెంట్లకే పరిమితమైన పవన్ తాజాగా తన పవర్ ఎలా ఉంటుందో చూపించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని పలు సందర్భాల్లో పెద్ద ఎత్తున లేవనెత్తిన పవన్ దాని సాధన కోసం అందరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. వాస్తవానికి ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చిన పవన్.. ఆ తర్వాత కూడా ప్యాకేజీని పలు సందర్భాల్లో తప్పుపట్టారు. ఇక, ఎప్పటి నుంచో దీనిపై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్న ఏపీ యువత అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తమిళనాట జల్లికట్టుపై అక్కడి యువత రెచ్చిపోవడం గమనించి అదే పంథాను ఎంచుకోవాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో ఆర్ కే బీచ్ వేదికగా ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టింది. దీనికి స్పందించిన పవన్ యువతకు తాము అండగా నిలుస్తామని ప్రకటించారు. అంతేకాదు, ఈ విషయంలో పెద్ద జనసేన పంథా ఎలా ఉండబోతోందో వివరించేందుకు ఓవీడియోని కూడా పవన్ పోస్ట్ చేశాడు. లక్ష గొంతులు ఏకమైనట్లుగా.. భారీ జన సందోహం బ్యాక్ డ్రాప్ లో నుంచి పిడికిలి బిగించిన చేయి ఒకటి బలంగా పైకి లేవటం.. ‘దేశ్ బచావో’అంటూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు. మరో పోస్టర్ లో ఆవేశంతో పిడికిలి బిగించిన పవన్ ఉన్న ఫోటోను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన కొన్ని వ్యాక్యాల్ని ట్వీట్ పోస్ట్ చేశారు. ‘‘నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో. అది నీ శరీర క్షేత్రంలో.. ధైర్యంలో చల్ల లేకపోతే.. అది నీ గుండెల్లో ఆత్మగౌరవం పండించలేకపోతే నీవు బానిసగానే ఉండిపోవటానికి నిర్ణయించుకుంటె.. ఎంత ద్రోహిగా మారావు ఆ పవిత్ర రక్తానికి..’’ అంటూ గుండెలు మండేలా.. భావోద్వేగం ఎగిసిపడేలా పవన్ ట్వీట్ చేయడం ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. ప్రతి ఒక్కరిలోనూ చైతన్యం నింపుతోంది.
మరో ట్వీట్ లో చట్టాలు చేసే పాలకులకు జెంటిల్ రిమైండర్ గా పెట్టిన ట్వీట్ లో తనలోని వ్యంగ్యం మొత్తాన్ని గుది గుచ్చినట్లుగా శేషేంద్ర శర్మ రాసిన పంక్తుల్ని యథాతధంగా పేర్కొంటూ.. ‘‘మేము పూలగుత్తులకు వ్రేలాడే వసంత రుతువులం కాదు.. వట్టి మనుషులం. దేశం మాకు గాయాలిచ్చినా నీకు మేం పువ్వులిస్తున్నాం. ఓ ఆశ చంద్రికల కుంభవృష్టి కురిశే మిత్రమా.. యోచించు ఏమి తెస్తావో మా అందరి కోసం. ఓటు అనే బోటు మీద ఒక సముద్రం దాటావు’’ అని పేర్కొన్నారు. నిజానికి చెప్పాలంటే ఈ రెండు ట్వీట్ల ద్వారా పవన్ ఎవరిని టార్గెట్ చేసుకున్నారో అర్ధం అవుతూనే ఉంది. ఇటు ఏపీని, అటు కేంద్రాన్ని కూడా ఆయన టార్గెట్ చేసుకున్నట్టే భావించాలి. లేకపోతే, ఇంత భారీస్థాయిలో మద్దతివ్వడం, ఉద్యమానికి ఊపిరి ఊదడం సాధారణ విషయం కాదు! మొత్తానికి పవన్ ఇప్పుడు ఏపీని కదిలించగలుగుతున్నాడనంలో సందేహం లేదు. ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.