బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా వెలుగొందుతోంది దీపికా పదుకోన్. అందం-అభినయంతో చిరకాలంలోనే తనకంటూ స్పెషల్ స్టేటస్ సంపాదించుకుంది. ఈ ఫ్యాషన్ డాళింగ్ ఇప్పుడు హాలీవుడ్లోనూ ‘ట్రిపుల్ ఎక్స్’సిరీస్ మూవీ ”ఎక్స్ ఎక్స్ ఎక్స్ – ద రిటాన్ ఆఫ్ గ్జాండర్ కేజ్’లో నటిస్తోంది. హాలీవుడ్ యాక్షన్ స్టార్స్ విన్ డీజిల్, రూబీ రోజ్, నైనా డొబ్రేవ్లాంటి హేమాహేమీలతో స్క్రీన్ పంచుకుంటోంది. మోడలింగ్ నుంచి హాలీవుడ్ వరకూ సాగిన ప్రయాణంపై దీపికా స్పందిస్తూ తాను చేస్తున్న పనిపై పూర్తి సంతృప్తి వ్యక్తంచేసింది. సరైన సమయంలోనే తనకు హాలీవుడ్ ఛాన్స్ వచ్చిందని వ్యాఖ్యానించింది.
ట్రిపుల్ ఎక్స్ మూవీకి ముందే దీపికాకు హాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్ట్లు తనను ఆకట్టుకోలేకపోయాయని అంతేకాక కొన్నింటిని చేయగలనన్న నమ్మకం తనకు కలుగలేదని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. దేశీయంగా చెప్పుకోదగ్గ విధంగానే నటించిన తర్వాత ఓ యాక్షన్ సినిమా చేయాలనిపించిందని.. ఆ సమయంలోనే ట్రిపుల్ ఎక్స్ ఆఫర్ వచ్చిందని తెలిపింది. యాక్షన్ పిక్చర్లో నటించాలన్న ఉత్సాహంతోనే ఈ సినిమా ఒప్పేసుకున్నానని చెప్పింది.
బాలీవుడ్-హాలీవుడ్ల మధ్య తేడాలేమైనా ఉన్నాయా అనే ప్రశ్నకు లేవనే సమాధానమిచ్చింది దీపికా. ఇరు సినీ పరిశ్రమల మధ్య తీవ్ర వ్యత్యాసాలేమీ లేవని.. కాకపోతే టైమ్ షెడ్యూల్లోనే తేడా ఉందని చెప్పింది. హాలీవుడ్లో షూటింగ్ టైమ్లో నటీనటులకు వారాంతాలు సైతం ఉంటాయట. ఇలా ఖాళీ దొరికినప్పుడు వంటకు కావాల్సిన సరుకులు కొనుక్కోవడం, బట్టలు ఉతుక్కోవడం చేసేదట దీపిక. ట్రిపుల్ ఎక్స్లో దీపిక పార్ట్ షూటింగ్ పూర్తైపోయింది. 2017 జనవరి 20న ఈ సినిమా విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది.