రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్దాలు కొనసాగుతున్నాయి. ఇరు తెలుగురాష్ట్రాల మధ్య నీటి సమస్య ను పరిష్కరించలేక కేంద్రం చేతులెత్తేసింది.ఇరు రాష్ట్రాల మధ్యనున్న నీటి సమస్య లను మీరే తేల్చుకోవాలని సూచించింది. కృష్ణా నీటి వాటాలు కొన్నాళ్ల పాటు యధాస్థితి లోనే కొనసాగుతాయని చెప్పింది. ఈ సమస్యకు పరిష్కారం లభించక పోవడం తో మరో నెల రోజుల పాటు గతసంవత్సరం లాగే నీటి వాటాలు ఉంటాయని తెలిపింది. ఈ లోగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు కలసి కూర్చొని ఓ అభిప్రాయానికి రావాలని సూచించింది.ఈ సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం లభించనందున రెండు రాష్ట్ర ప్రభుత్వాలే ఓ నిర్ణయానికి రావాలని తెలిపింది. నెల రోజుల్లోగా మీ నిర్ణయాన్ని తెలపాలని కేంద్ర జలవనరుల శాఖ కోరింది.కాగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు బాగా ముదిరినట్టే కనిపిస్తున్నాయి.కృష్ణా నదిపై తెలంగాణా సర్కారు నిర్మించ తలపెట్టిన పాలమూరు- రంగారెడ్డి , డిండి ప్రాజెక్టులే ఈ వివాదానికి కారణమయ్యాయి. వీటి వలన రాయల సీమ ప్రాంతం ఎడారిగా మారుతుందని ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.నీటి సమస్యలను పరిష్కరించమని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రజలవనరుల శాఖను కోరినా.. కేంద్రం మాత్రం గోడమీద పిల్లిలా వ్యవహరిస్తోందనే విమర్శ వినిపిస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు ముదిరే క్రమం లో అది బీజేపీ కి ప్లస్ అవుతుందని…ఈ వివాదాన్ని తమకు అనుకూలం గా మార్చుకునేందుకు సమస్యను పరిష్కరించకుండా నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది.
తెలుగు రాష్ర్టాల్లోనూ నీటి యుద్ధాలు మొదలయ్యాయి. ఈ యుద్ధాలన్నీ నదీజలాలపైనే. ఈ జలాల పంపకాలు సోదరు రాష్ర్టాల్లో ఎలా సాగాలి? ఎన్ని టీఎంసీల నీళ్లు ఎవరికి వదలాలి? అన్నదానిపైనే. దీనికి కేంద్ర జలవనరుల శాఖ సైతం చేతులెత్తేసే పరిస్థితి వచ్చిందిప్పుడు. నిన్నటిరోజున నీటి పంపకాలపై ఎవరికెంత వాటా ఇవ్వాలి? అన్నదానిపై నదీయాజమాన్య బోర్డ్, కేంద్ర జలవనరుల శాఖ మంతనాలు సాగించాయి. ఇరు రాష్ర్టాల ముఖ్యనేతల మధ్య చర్చోపచర్చలు సాగాయి. అయినా అదేదీ తేలలేదు. ఇక్కడ ఎడ్డెం అంటే తెడ్డెం అన్న చందంగానే సాగింది. ముఖ్యంగా కృష్ణా జలాల్ని ఎలా పంపిణీ చేయాలి? అన్నదానిపై ఏదీ తేలలేదు. నాగార్జున సాగర్ కాల్వను మేమే తవ్వేసుకుంటాం.. మీ అనుమతేంటి? అంటూ ఏపీ నేతలు ప్రకటించారు. దానికి తెలంగాణ నేతలు ససేమిరా అన్నారు. ఏపీలో నిర్మిస్తున్న పట్టిసీమ నుంచి మాక్కూడా వాటా కావాలంటూ తెలంగాణ పట్టుబట్టింది. దీంతో ఎటూ తేలని పరిస్థితి ఏర్పడింది. నిన్నటి సమావేశాన్ని ఈరోజుకి కూడా పొడిగించాల్సొచ్చింది. ప్రస్తుతం ఢిల్లీలో ఢిల్లీ నేతల సాక్షిగా ఈ చర్చలు సాగుతున్నాయి. ఎవరేం మాట్లాడినా ఇరు రాష్ర్టాల నేతలు వినే పరిస్థితి లేదు. ఇప్పట్లో ఈ సమస్యకు పరిష్కారం కనిపించడం లేదని ప్రత్యక్షంగా పాల్గొన్న నేతలే అంటున్నారు. ఇలా అయితే మా చేతుల్లోకే అన్నీ తీసుకోవాల్సొస్తుందని కేంద్ర జలవనరుల శాఖ ప్రకటించింది. ఇదంతా చూస్తుంటే నీటి యుద్ధాలు మునుముందు మరిన్ని దారుణ పరిణామాలకు దారి తీసే ఛాన్సుందని అర్థమవుతోంది. ఏపీ, తెలంగాణ నేతలు ఒకరిపై ఒకరు కాలు దువ్వుకుని నదులకు చిల్లు పెట్టి ఊళ్లను ముంచే పరిస్థితి వచ్చేట్టే కనిపిస్తోంది.