కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ టీడీపీలో చేరతారన్న ప్రచారం ఊపందుకుంది. పుష్కరాల తర్వాత నెహ్రూ ఆయన తనయుడు దేవినేని అవినాష్ టీడీపీలో చేరతారని కూడా విజయవాడ పాలిటిక్స్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. నెహ్రూ రెండు రోజుల క్రితం ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావును ఆయన నివాసంలో కలిశారు. నెహ్రూతో పాటు మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు కూడా ఈ భేటీలో ఉన్నారు. నెహ్రూ టీడీపీ ఎంట్రీ విషయాన్ని గతంలోనే గద్దే బాబూరావు, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు సీఎం చంద్రబాబు వద్ద ప్రతిపాదించగా ఆయన సుముఖత వ్యక్తం చేశారని..ఇక కృష్ణా పుష్కరాల తర్వాత ఆయన పార్టీలో చేరతారని జిల్లా టీడీపీలో వినిపిస్తోన్న టాక్.
ఏపీ రాజధాని ప్రాంతంలో ఎంతో పట్టున్న నెహ్రూ లాంటి సీనియర్ అండ పార్టీకి అవసరమని చంద్రబాబు భావిస్తున్నారట. ఇదిలా ఉంటే నెహ్రూ టీడీపీ ఎంట్రీని జిల్లాకు చెందిన పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. విజయవాడలో పార్టీ చాలా బలంగా ఉందని, ఈ నేపథ్యంలో నెహ్రూని టీడీపీలోకి తీసుకోవడం అవసరమా అని పలువురు పార్టీ సీనియర్లు కూడా ప్రశ్నిస్తున్నారట.
నెహ్రూ గతంలో ప్రాథినిత్యం వహించిన ప్రాంతాలకు ప్రస్తుతం వల్లభనేని వంశీ, బోడే ప్రసాద్, గద్దే రామ్మోహన్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. నెహ్రూ టీడీపీలో చేరితే ఆయన తన అనుచరగణంతో తమకు లేనిపోని తలనొప్పులు తెప్పిస్తాడని వీరంతా అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. అందుకే వీరు నెహ్రూ టీడీపీ ఎంట్రీ విషయంలో సుముఖంగా లేరట. అయితే నెహ్రూ టీడీపీ ఎంట్రీ వల్ల ఇప్పటికిప్పుడు పెద్ద లాభం లేకపోయినా ఆయన వైకాపాలో వెళితే కాస్త ఇబ్బంది ఉంటుందని..అందుకే టీడీపీలోకి తీసుకుంటే సీనియర్ నేతగా పార్టీకి ఎంతోకొంత ఉపయోగపడతారని బాబు ప్లాన్గా తెలుస్తోంది.భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే నెహ్రూ తనయుడు అవినాష్కు ఏదో ఒక చోట నుంచి అసెంబ్లీ సీటు ఇచ్చేలా నెహ్రూ కోరుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ ప్రతిపాదనలకు చంద్రబాబు ఎలా ఓకే చేస్తారో ? నెహ్రూ టీడీపీ ఎంట్రీపై అసంతృప్తిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలను ఎలా బుజ్జగిస్తారో చూడాలి.