సమైక్యాంధ్రలోనే బెజవాడ రాజకీయం అంటే మహారంజుగా ఉండేది. బెజవాడ పాలిటిక్స్లో ఏం జరుగుతుందా ? అని అందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూసేవారు. రెండు ఫ్యామిలీల మధ్య వార్ బెజవాడ పాలిటిక్స్ను చాలా ఇంట్రస్టింగ్గా మార్చేశాయి. ఇదిలా ఉంటే అదే బెజవాడలో విపక్ష వైసీపీ పాలిటిక్స్ ఇప్పుడు మహా ఇంట్రస్టింగ్గా మారాయి. ఏపీ రాజకీయాలకు కేంద్రబిందువైన విజయవాడలో పట్టుకోసం వైసీపీ అధినేత జగన్ గత ఎన్నికల తర్వాత నుంచి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే అక్కడ వైసీపీ నగర బాధ్యతలు ముందుగా దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు అప్పగించారు. రాధా పార్టీ పటిష్టతకోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న అసంతృప్తితో ఉన్న జగన్ తాజాగా రాధాను తప్పించి ఆ ప్లేస్లో ఇటీవల పార్టీలోకి వచ్చిన వెస్ట్ మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుకు విజయవాడ నగర బాధ్యతలు అప్పగించారు.
రాధాకు వెల్లంపల్లికి అస్సలు పడదు. ఈ పరిణామం సహజంగానే రాధాకి మంట పుట్టిస్తోంది.అదే టైం లో కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు ని పార్టీలోకి తీసుకు వచ్చేందుకు కూడా జగన్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మల్లాదికి రంగాకు కూడా రాజకీయంగా వైరం ఉంది. 2009లో రంగాను మల్లాది ఓడించారు. విష్ణు రాక కూడా రాధాకి తలనొప్పి లాంటిదే. అటు వెల్లంపల్లి, ఇటు విష్ణు కూడా వైసీపీలోకి వస్తే రాధా పని ఖేల్ ఖతం అయినట్టే.
జగన్ వేస్తోన్న ఈ ప్లాన్లు అన్ని రాధాని వదిలించుకోడానికే అని వంగవీటి అభిమానులు చర్చించుకుంటున్నారు. వెల్లంపల్లికి విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఉంది… విష్ణు కూడా పార్టీలోకి వస్తే ఆయనకు సెంట్రల్ ఇవ్వాలి. ఇక రాధాకు మిగిలింది తూర్పు ఒక్కటే.. అయితే రాధా గత ఎన్నికల్లో తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయి ప్రస్తుతం సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్గా ఉన్నారు. మరి విష్ణు వైసీపీలోకి వస్తే మనోడు తిరిగి తూర్పుకే వెళ్లాలి.
వైసీపీ ఇటీవలే తూర్పు నియోజకవర్గానికి కార్పొరేటర్ బొప్పన భావకుమార్ను ఇన్చార్జ్ చేసింది. సో ఇవన్నీ చూస్తుంటే వైసీపీలో రాధాకు జగన్ పొమ్మనలేక పొగబెడుతున్నట్టే ఉంది.