మంత్రి గంటా కొంప ముంచిన పవన్

ఏపీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావుకు ఈ మధ్య కాలం క‌లిసి రావ‌ట్లేదు! తాడును ముట్టుకున్నా అది పామై క‌రుస్తోంది! ఇప్ప‌టికే కోర్టు కేసులు, ఆస్తుల వేలం, మంత్రి ప‌దవికి ఎస‌రు ఇలాంటి వాటితో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఆయ‌నపై జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఇప్పుడు చంద్ర‌బాబుకు ఫిర్యాదు చేయడం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మెగా స్టార్ చిరుకు అత్యంత స‌న్నిహితుడిగా ఉన్న గంటాపై ప‌వ‌న్ ఎందుకు మండిప‌డ్డాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అస‌లే స‌మ‌స్య‌ల వ‌ల‌యంలో చిక్కుకుని మంత్రి ప‌ద‌వి ఉంటుందా లేదా అని సందేహ‌ప‌డుతున్న గంటాకు.. ప‌వ‌న్ ఫిర్యాదుతో గొంతులో వెల‌క్కాయ‌ప‌డినంత ప‌నైంద‌ట‌.

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన యూనివ‌ర్సిటీ విద్యార్థులు త‌మ బాధ‌ను జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్‌కు తెలియ‌జేసేందుకు పాద‌యాత్ర చేప‌ట్టారు. అది కూడా సింహ‌పురి యూనివ‌ర్సిటీ నుంచి హైద‌రాబాద్ వ‌ర‌కూ.. అయితే విజ‌య‌వాడ వ‌ద్ద‌కు వ‌చ్చేసరికే వారు తీవ్ర‌ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో అక్క‌డే ఓ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందారు. విష‌యం తెలిసిన కాట‌మ‌రాయుడు… విద్యార్థుల‌కు ఫోన్‌చేసి రామోజీ ఫిలింసిటీకు పిలిపించుకుని వారితో మాట్లాడారు. నిర‌స‌న తెలియజేయాల్సిన ప‌ద్ధ‌తి ఇది కాద‌ని, స్వ‌రం వినిపించాల్సిందే కానీ.. ఇంత క‌ఠినమైన ఆందోళ‌న‌లు చేప‌ట్ట‌వ‌ద్దంటూ విద్యార్థుల‌కు ప‌వ‌న్ సూచించార‌ట‌. వారి స‌మ‌స్యను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ‌తానంటూ భ‌రోసా ఇచ్చిన ప‌వ‌న్‌.. వారిని పంపేశారు. ఆ త‌రువాతే.. మంత్రి ఘంటా శ్రీనివాస‌రావును ఉద్దేశించి జ‌న‌సేన నేత చంద్ర‌బాబుకు ఫిర్యాదు చేసిన‌ట్లు  స‌మాచారం.

ఇప్ప‌టికే అయ్య‌న్న‌తో విభేదాల వ‌ల్ల ముఖ్య‌మంత్రి ఆగ్ర‌హానికి గురై.. ముప్పేట దాడితో చిత్త‌వుతున్న ఘంటాకు.. ప‌వ‌న్ ఫిర్యాదుతో ఉలికిపాటు మొద‌లైంద‌ట‌. ఏపీ మంత్రి ఘంటాపై  జ‌న‌సేన నేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్  మండిప‌డ్డార‌ట‌. మాన‌వ వ‌న‌రుల మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఆయ‌న ప‌ద‌వికి హుందాత‌నం తీసుకురావాలంటూ సున్నితంగా మంద‌లించార‌ని స‌మాచారం. మెగా అభిమానిగా ముద్ర‌ప‌డిన గంటాను ప‌వ‌న్ ఎందుకు టార్గెట్ చేశాడ‌నేది ప్ర‌శ్న‌!