కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో కీలక మలుపు ఏమిటంటే ఆసుపత్రిలో బలవంతంగా తనను చేర్చినప్పటికీ ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించడానికి సిద్ధపడటంలేదు. బలవంతంగా వైద్యులు ఆయనకు ఫ్లూయిడ్స్ ఎక్కించాలని చూస్తుండగా, వారిని ప్రతిఘటిస్తున్నారు ఆయన. ఇంకో వైపున తుని విధ్వంసంపై సిబిఐ విచారణ చేయించడానికి సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు ప్రభుత్వం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. సిబిఐకి ఇచ్చేంత చిత్తశుద్ధి చంద్రబాబు ప్రభుత్వానికి లేదు. అందుకనే ముద్రగడ అంగీకరించాలనే అడ్డుపుల్ల వేసింది.
ముద్రగడ కూడా సిబిఐ విచారణకు ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే విధ్వంసం జరిగిన మాట వాస్తవం. అందులో అత్యుత్సాహంతో కాపు యువత కూడా పాల్గొంది. సిబిఐ విచారణ అంటూ జరిగితే వాళ్ళంతా కేసుల్లో ఇరుక్కుని భవిష్యత్తును కోల్పోతారు. సరిగ్గా ఇదే ఆలోచించింది చంద్రబాబు ప్రభుత్వం. ఇక్కడ ప్రభుత్వం ముద్రగడను సిబిఐ పేరుతో బ్లాక్మెయిల్ చేసింది. ఈ బ్లాక్మెయిల్ కారణంగానే ముద్రగడ పద్మనాభం కూడా గందరగోళంలో పడ్డారని వినికిడి. సిబిఐ బూచిని చూపించి ముద్రగడ పద్మనాభంను కాపు రిజర్వేషన్ ఉద్యమం నుంచి దూరం చెయ్యాలనే ప్రయత్నాలు కూడా జరుగుతుండం పట్ల ఆ సామాజిక వర్గం ఆందోళన చెందుతోంది.