వైసీపీలో ఫైర్బ్రాండ్గా గుర్తింపు పొందిన నగరి ఎమ్మెల్యే రోజా కి ఇక చెక్ తప్పదనే వార్తలు వస్తున్నాయి. అటు అసెంబ్లీలోనూ, ఇటు బయటా అధికార టీడీపీని ఇరుకున పెట్టడం సహా సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్పై సటైర్లతో విరుచుకుపడడంలో రోజాకు సాటి ఇప్పటి వరకు వైకాపాలో కనిపించలేదు. గిడ్డి ఈశ్వరి వంటి వారు ఒకరిద్దరు ఉన్నా కూడా రోజాకి సాటి రోజా యే అన్నచందంగా ఉంది. దీంతో జగన్ కూడా ఎప్పుడూ రోజాకి అడ్డు చెప్పకపోగా ఆమెను మరింతగా ప్రోత్సహించారని ఆ పార్టీ నేతలు చెబుతారు. ఇక, విషయంలోకి వెళ్తే.. ఇప్పుడు రోజాకి చెక్ పెడుతూ మరో ఫైర్ బ్రాండ్ పార్టీలోకి వస్తోందట!
తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో అప్పటి మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డి పెట్టిన పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన నటి హేమ.. ఇప్పుడు వైకాపాలోకి జంప్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అఫీషియల్గా దీనిపై ఎనౌన్స్ మెంట్ ఏమీ రాకపోయినా.. గత కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలను, హేమ చేస్తున్న ప్రకటనలను గమనిస్తే.. ఆమె జగన్ గూటికి బెత్తెడు దూరంలో ఉన్నట్టే తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన హేమ … నిన్నమొన్నటి వరకు సైలెంట్గా ఉండి.. ఇటీవల తన గళం విప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు కాపులకు అన్యాయం చేస్తున్నారని ఇచ్చిన హామీని నెరవేర్చడం లేదని అన్నారు.
అంతటితో ఆగకుండా కాపు సమస్యలపై కాపులు పోరాటం చేయకుండా ఎవరు చేస్తారని ప్రశ్నించారు. ఓ రకంగా ఎలాంటి రేంజ్ లేకపోయినా.. చంద్రబాబును ఆమె టార్గెట్ చేశారు. వైకాపా నేతలకు ఇంతకన్నా ఇంకేం కావాలి! సో.. హేమ రికార్డులను వాళ్లు పదేపదే పెట్టుకుని మరీ వింటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారట. ఈ క్రమంలోనే రోజా కూడా హేమేంటి ఇలా రెచ్చిపోయింది? అని ఆశ్చర్యం వ్యక్తం చేసిందట. సో.. ఎంతైనా వైకాపా గూటికి చేరాలంటే ఆమాత్రం రేంజ్ ఉండాలి కదా అని విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా.. రోజాకు తోడు దొరికిందని ఒకరంటుంటే.. ఆమెకు మొగుడు మాదిరి హేమ మారుతుందా? అనే వాళ్లూ ఉన్నారు.