వైసీపీ క్యాడర్ ను తికమక పెడుతున్న మాజీమంత్రి

ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో `గోపి(గోడ మీద పిల్లి)`లు ఎక్కువమంది! ఏమాత్రం మంచి అవ‌కాశం వ‌చ్చినా  ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి..  ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి చేరిపోయే నాయ‌కులే ఎక్కువ‌! ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష పార్టీలో ఉంటూ.. అటు అధికార పార్టీ నేత‌లోనూ స‌న్నిహిత సంబంధాలు నెరుపుతూ.. రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం చేస్తున్న వారే అధికం!! ప్ర‌స్తుతం ప్ర‌కాశం జిల్లాలోని ఒక మాజీ మంత్రి కూడా ఇలా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో.. ఆమె ఏ పార్టీకి చెందిన వారో తెలియక నేత‌లు గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ లో కొనసాగుతూ జగన్ పేరు చెప్పుకొంటూ ప్రజాదరణను పొందుతున్న కొంతమంది నేత‌లు..  లోపాయికారీగా తెలుగుదేశంతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నవ్య‌వ‌హారం గిద్దలూరు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది! ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైకాపా తరపున గెలిచిన అశోక్ రెడ్డి ఇప్పటికే టీడీపీలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సాయి కల్పన రెడ్డి.. తీరు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. జగన్ పేరు చెప్పుకొంటూ రాజకీయం చేస్తున్న ఈమె.. పరోక్షంగా తెలుగుదేశంతో సన్నిహిత సంబంధాలు నెరుపుతుండటంతో ఆమె కూడా జంప్ జిలానీనేనేమో అనే సందేహం.

సాయి కల్పన తనయ అర్చన ‘రెసిపీ ఫర్ సక్సెస్’ అనే పుస్తకం రచించింది. విస్మయకరమైన విషయం ఏమిటంటే.. ఈ పుస్తకం కాపీలను ఆమె తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ కు బహుకరించింది! ఒకవైపు అర్చన తల్లి సాయి కల్పన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతగా చలామణీ అవుతోంది. కూతురేమో.. ‘రెసిపీ ఫర్ సక్సెస్’పుస్తకంతో చంద్రబాబును లోకేష్ బాబును కలిసి తమ సాన్నిహిత్యాన్ని బహిర్గతం చేసింది! మరి ఏ హోదాలో ఉన్నాడని లోకేష్ ను కలిసి.. ఈ పుస్తకాన్ని బహుకరించారో క్యాడ‌ర్‌కు మింగుడుప‌డ‌ని అంశం.

ఇదంతా సాయి కల్పన కు తెలుగుదేశం పార్టీతో గల సాన్నిహిత్యానికి నిదర్శనం అని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. చంద్రబాబు లోకేష్ లతో సాయి కల్పన రెడ్డికి వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయని.. ఆఖరికి కూతురు రచించిన పుస్తకంతో జగన్ ను కలవాల్సింది పోయి..  చంద్రబాబు లోకేష్ లతో కలిసేంత సాన్నిహిత్యం వీరిదని స్థానికులు అనుకుంటున్నారు. అలాగే ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో కూడా సాయికల్పనకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయ‌ట‌. మ‌రి ఏది ఏమైనా  ఆమె వ్య‌వహారం ఏ ప‌రిస్థితుల‌కు దారి తీస్తుందో!!