కృష్ణా జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో పశ్చిమగోదావరి జిల్లాకు సరిహద్దుగా ఉండే నియోజకవర్గం నూజివీడు. గతంలో నూజివీడు జమిందారులు ఈ ప్రాంతాన్ని ఎన్నో శతాబ్దాల పాటు పాలించడంతో ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. నూజివీడును పాలించిన మేకా వంశానికి చెందిన ప్రతాప్ అప్పారావు ఫ్యామిలీకి నియోజకవర్గంలో బలమైన నేపథ్యం ఉంది. 1999లో ఇండిపెండెంట్గా పోటీ చేసి 40 వేల ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచిన ప్రతాప్, 2004లో కాంగ్రెస్ తరపున భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. 2009లో ఓడినా వైసీపీ తరపున 2014లో గెలిచారు.
ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ప్రతాప్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టిన ప్రతాప్ ఇప్పుడు చిన్నపాటి సమస్యలను కూడా పరిష్కరించలేకపోతున్నాడు. నాగార్జున సాగర్ కాలువ ద్వారా మంత్రి ఉమా పక్కనే తన నియోజకవర్గం మైలవరంకు నీటిని తరలించుకుపోతున్నా ప్రతాప్ మాత్రం నోరెత్తడం లేదన్న విమర్శలు ఉన్నాయి.వ్యక్తిగతంలో కాస్తో కూస్తో ఉన్న ఇమేజ్, టౌన్లో ఉన్న పట్టు ఆయన్ను ఇప్పటకీ ముందుకు నడిపిస్తున్నాయి. ఇక స్థానిక సంస్థలన్ని మెజార్టీ వైసీపీ ఆధీనంలో ఉండడంతో పాటు ప్రత్యర్థిగా ఉన్న టీడీపీ ఇన్చార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు స్థానికేతరుడు కావడం, టీడీపీలో ఉన్న వర్గ రాజకీయాలు ప్రతాప్కు ఇప్పటి వరకు కలిసొచ్చాయి. అయితే ఇటీవల టీడీపీలో ఎంపీ మాగంటి, ముద్రబోయిన ఒక్కటవ్వడం టీడీపీ బలం పెరుగుతోంది.
ఇక ప్రతాప్ కొన్ని యేళ్ల నుంచి నూజివీడు పట్టణంలో ఉన్న వ్యక్తుల చేతుల్లో బందీ అయ్యారన్న విమర్శ ఉంది. దీంతో ఆయన పట్టణంలోని ఆ వ్యక్తుల చేతుల్లో కీలుబొమ్మగా మారడంతో ఆయన నియోజకవర్గంలో మిగిలిన మండలాల పార్టీ నాయకులను చాలా తేలికగా తీసుకోవడం కూడా ఆయనకు పెద్ద దెబ్బే. ఇది చాలా రోజుల నుంచి కంటిన్యూ అవుతోంది.
ప్లస్ పాయింట్స్ (+) :
– వ్యక్తిగత ఇమేజ్
– సరైన ప్రత్యర్థి లేకపోవడం
– స్థానిక సంస్థలు మెజార్టీ వైసీపీ ఆధీనంలో ఉండడం
– ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి పనులు
మైనస్ పాయింట్స్ (-) :
– శాసనసభలో నియోజకవర్గ అంశాల ప్రస్తావన లేకపోవడం
– గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటితో పోల్చుకుంటే స్పీడ్గా లేకపోవడం
– ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కావడంతో నియోజకవర్గంలో కానరాని అభివృద్ధి
– నూజివీడు పట్టణంలో కొంతమంది చేతుల్లో కీలబొమ్మగా మారారన్న విమర్శలు
– నియోజకవర్గ రైతుల నీటి సమస్యలు అస్సలు పట్టించుకోకపోవడం
– జనసేన పోటీ చేస్తే కాపుల ఓట్లు చీలి నష్టపోయే ప్రమాదం
తుదితీర్పు :
వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆయనకు ఆల్ట్రనేటివ్ లేకపోవడంతో మరోసారి గ్యారెంటీగా టిక్కెట్టు దక్కుతుంది. వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తే నియోజకవర్గంలో బలంగా ఉన్న కాపు ఓటు బ్యాంకు చీలడం ప్రతాప్కు మైనస్. ఇక్కడ జనసేన తరపున బలమైన ప్రత్యర్థి ఉంటే ప్రతాప్కు గెలుపు కష్టమే అవుతుంది.
2009లో ప్రజారాజ్యం పార్టీ పోటీ చేయడంతో కాపుల ఓట్లు టౌన్లో బాగా చీలి ఆ పార్టీకి పడడంతో ప్రతాప్ టీడీపీ అభ్యర్థి రామకోటయ్య చేతిలో ఓడిపోయారు. మరోసారి 2019లోను జనసేన పోటీ చేసి కాపుల ఓట్లు చీలిస్తే ప్రతాప్కు ఇబ్బంది తప్పదు. వెలమ కులానికి చెందిన ప్రతాప్కు కాపుల ఓట్లే ప్రధాన బలం.
ఇక టీడీపీ ఇన్చార్జ్ ముద్రబోయిన బీసీల్లో బలమైన యాదవ వర్గానికి చెందిన వ్యక్తి. ఆయనకు పార్టీ పరంగా కమ్మల మద్దతు ఎలాగూ ఉంటుంది. ఇక ఇటీవల నియోజకవర్గంలో బీసీలన్ని కూడా ఒకేతాటిమీదకు వస్తున్నాయి. ఇవి కూడా ప్రతాప్కు మైనస్. ప్రస్తుతానికి నూజివీడు రాజకీయం స్తబ్దుగా ఉన్నా వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా మారే సూచనలు ఉన్నాయి.