శశికళ జయ దోస్తానా కట్!

అన్నా డీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివల వివాదం మరో మలుపు తిరిగి, అన్నా డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వర్సెస్ శశికళగా మారింది. చెంపదెబ్బలుకొట్టినందుకు శివకు క్షమాపణలు చెప్పానన్న శశికళ.. జయలలితపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.జయలలిత తనను బెదిరించారని, ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని శశికళ ఆరోపించారు. రాజీనామా చేయాలంటూ గత రెండు నెలలుగా తనను వేధించారని తెలిపారు.

తన ఇంటికి వెళ్లేందుకు అనుమతించకుండా, పోయస్ గార్డెన్లో తనను కుక్కులా ఉంచారని ఆరోపించారు. తనను ఆమె కొట్టారని చెప్పిన శశికళ.. చేయిచేసుకుంది జయలలితా? అన్న మీడియా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అన్నా డీఎంకే నుంచి తనను బహిష్కరించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఇక నుంచి నుంచి తాను స్వతహాగా ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు. ఆమె రాజ్యసభలో మాట్లాడుతూ కన్నీరుపెట్టుకున్నారు.

తమిళనాడులో తనకు రక్షణ లేదని, భద్రత కల్పించాల్సిందిగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్కు విన్నవించారు. శనివారం నాడు ఢిల్లీ విమానాశ్రయంలో ఎంపీ శశికళ పుష్ప, తిరుచ్చి శివ గొడవపడిన సంగతి తెలిసిందే. తిరుచ్చి శివను చెంప మీద ఆమె ఎడాపెడా కొట్టడం దుమారం రేపింది.