బాలీవుడ్ బాద్షా షారుఖ్ఖాన్పై బీజేపీ మరోసారి తన అక్కసంతా వెళ్లగక్కింది. గతంలో బీజేపీ నేతలకు వ్యతిరేకంగా కామెంట్లు చేసిన షారుఖ్ను ఆ పార్టీ ఇప్పటికీ విడిచి పెట్టడం లేదనేందుకు ఇప్పడు మరో ఘటన ఉదాహరణగా మిగిలింది. విషయంలోకి వెళ్లిపోతే.. షారుఖ్ తాజా మూవీ రయీస్ విడుదలకు సిద్ధమైంది. అదేసమయంలో హృతిక్ రోషన్ న్యూ మూవీ కాబిల్ కూడా అదే రోజు విడుదలకు రెడీ అయింది. అయితే, షారుఖ్ మూవీని చూడొద్దని అందులో పస లేదని మీనింగ్ వచ్చేలా బీజేపీ సీనియర్ నేత కైలాష్ విజయ్వర్గియా ఓ ట్వీట్ చేశారు.
ఇది పూర్తిగా నెగెటివ్ మార్కులు పడేలా చేస్తోంది. దీంతో ఇప్పుడు కైలాష్ చేసిన కామెంట్లపైనే చర్చ నడుస్తోంది. ఈ రెండు మూవీలనీ పోల్చుతూ కైలాష్ చేసిన ట్వీట్ రగడకు దారితీస్తోంది. దేశభక్తి లేని ఆ రయీస్ (ధనికులు) వల్ల ఏం ప్రయోజనం లేదు.. మనమంతా కాబిల్ (సమర్థ) దేశభక్తుడికి మద్దతు తెలుపుదాం అంటూ కైలాష్ పరోక్షంగా షారుక్ రయీస్ సినిమా చూడొద్దన్న అర్థమొచ్చేలా ట్వీట్ చేశారు. దీంతో షారుఖ్ అభిమానులు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. దీంతో స్పందించిన కైలాష్ నల్లధనం అంశంపై అలా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారని బీజేపీ అధికార ప్రతినిధి షైనా ఎన్సీ ట్వీట్ చేశారు.
కైలాష్ ట్వీట్తోపాటు మోదీ నల్లధనంపై సాధించిన విజయానికి గుర్తుగా తాను సంబరాలు చేసుకుంటున్న ఫొటోను కూడా జత చేసిన విషయాన్ని షైనా గుర్తు చేశారు. ఇక ట్వీట్లో ఎక్కడా షారుక్ లేదా హృతిక్ పేరు కూడా ప్రస్తావించకపోవడాన్ని ప్రధానంగా పేర్కొన్నారు. అయితే ఈ ట్వీట్పై కైలాష్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి వివరణా ఇవ్వలేదు. కానీ గతంలోనూ షారుక్ఖాన్ లక్ష్యంగా కైలాష్ విమర్శలు చేశారు. షారుక్ఖాన్ ఇండియాలో ఉంటున్నా మనసు మాత్రం పాకిస్థాన్లో ఉంటుంది. ఆయన సినిమాలు ఇండియాలో కోట్లు గడిస్తున్నా.. షారుక్కు మాత్రం ఇక్కడ అసహనం కనిపిస్తుంది అని 2015లో కైలాష్ వ్యాఖ్యానించారు. మరి దీనిపై షారుఖ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.