ఏపీలో స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ బలంగా ఉన్న కడప-కర్నూలు-నెల్లూరు జిల్లాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు. దీంతో వైసీపీ అధినేత జగన్ ఈ మూడు జిల్లాల్లో కొందరు పార్టీ నేతలపై చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కీలక స్థానాల్లో ఉన్న వారికి సైతం 2019 ఎన్నికల సాక్షిగా షాక్ ఇవ్వక తప్పదని తెలుస్తోంది.
కడప జిల్లా కంచుకోటను టీడీపీ బద్ధలు కొట్టడంపై ఆగ్రహంగా ఉన్న వైసీపీ అధినేత జగన్ ముందుగా సొంత జిల్లా నుంచే పోస్ట్మార్టమ్ స్టార్ట్ చేశారు. తన సొంత జిల్లాలో పార్టీ అభ్యర్థి ఓడిపోవడంపై అందుకు బాధ్యులైన వారిని పూర్తిగా పక్కన పెట్టేయాలన్న నిర్ణయానికి జగన్ వచ్చేశాడట. ఈ ఓటమిపై జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించిన జగన్ కడప ఎంపీ, తన సోదరుడు అవినాష్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినట్టు తెలుస్తోంది.
జగన్ ఈ సమీక్షలో చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే అవినాష్రెడ్డికి వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీ సీటు దక్కే అవకాశం లేదన్న టాక్ వైసీపీలో వినిపిస్తోంది. బాబాయ్ వివేక ఓటమికి అసలు కారణం ఎంపీ అవినాష్ రెడ్డి వైఫల్యమే అని భావిస్తోన్న జగన్ 2019లో కడప సీటును బాబాయ్ వివేకకే ఇస్తాడన్న చర్చలు కడప వైసీపీలో వినిపిస్తున్నాయి.
నంద్యాలకూ కొత్త క్యాండెట్ :
ఇక గత ఎన్నికల్లో తాను ఎంతో నమ్మకంతో నంద్యాల ఎంపీ టిక్కెట్టు ఇస్తే భారీ మెజార్టీతో గెలిచిన ఎస్పీవై.రెడ్డి గెలిచిన వారం రోజులకే పార్టీ కండువా మార్చేసిన సంగతి తెలిసిందే. తర్వాత ఎస్పీవై.రెడ్డి అటు టీడీపీకి కాకుండా ఇటు వైసీపీకి కాకుండా ముందుకు వెళుతున్నాడు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎస్పీవై.రెడ్డికి ఏ మాత్రం టిక్కెట్టు ఇచ్చే ఛాన్సులు కనపడడం లేదు. ఇక్కడి నుంచి కూడా జగన్ ఎంపీగా కొత్త వ్యక్తికి సీటు ఇవ్వడం కన్ఫార్మ్గా కనిపిస్తోంది.