తెలంగాణలో సీఎం కేసీఆర్ వారసుడిగా దూసుకుపోతోన్న ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో కొత్త స్టెప్ తీసుకోనున్నారా ? ఆయన ఇప్పటి వరకు ప్రాథినిత్యం వహిస్తోన్న సిరిసిల్ల నియోజకవర్గానికి గుడ్ బై చెప్పేసి వచ్చే ఎన్నికల్లో గ్రేటర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారా ? అంటే టీఆర్ఎస్ ఇన్నర్ సర్కిల్స్లో అవుననే ఆన్సర్ వస్తోంది.
కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. 2009 ఎన్నికల్లో 71 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచిన కేటీఆర్ తర్వాత 2012 బైపోల్తో పాటు 2014 సాధారణ ఎన్నికల్లోను విజయం సాధించి మూడో విజయంతో హ్యాట్రిక్ కొట్టాడు. కేటీఆర్ సిరిసిల్లను బాగా డవలప్ చేస్తున్నాడు. జిల్లాలో పునర్విభజనలో పట్టుబట్టి మరీ ఆయన సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయించారు.
ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లలో తనకు నమ్మకమైన వ్యక్తిని రంగంలో ఉంచి కేటీఆర్ మాత్రం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయంలో కేటీఆర్ పాత్ర తిరుగులేనిది. ఇక్కడ జరిగిన ఎన్నికల్లో 150 కార్పొరేటర్ వార్డులకు టీఆర్ఎస్ ఏకంగా 99 చోట్ల విజయం సాధించి, తిరుగులేని మెజార్టీతో గ్రేటర్ పీఠం కైవసం చేసుకుంది.
వచ్చే ఎన్నికల్లో సెటిలర్స్, నార్త్ ఇండియన్స్ ఓటర్లు ఎక్కువుగా ఉన్న గ్రేటర్లో మరోసారి కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు పునరావృతం చేసేందుకు కేటీఆర్ ప్లాన్లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే తానే స్వయంగా గ్రేటర్ పరిధిలోని ఖైరతాబాద్ నుంచి పోటీ చేస్త ఆ ఎఫెక్ట్ మొత్తం గ్రేటర్లోని అన్ని సీట్లపై ఉండడంతో పాటు సికింద్రాబాద్ ఎంపీ సీటును కూడా తాము గెలుచుకోవచ్చని కేటీఆర్ స్కెచ్గా పార్టీ వర్గాలు చెపుతున్నాయి.
ఇక కేటీఆర్ ప్రస్తుతం ప్రాథినిత్యం వహిస్తోన్న సిరిసిల్లలో కేసీఆర్ కుమార్తె కవిత కూడా పోటీ చేయవచ్చని తెలుస్తోంది. మంత్రి అవ్వాలని విశ్వప్రయత్నాలు చేస్తోన్న ఆమె వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే ఇంట్రస్ట్గా ఉన్నారట. కవిత ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే కేసీఆర్ ఇష్టపడని పక్షంలో సిరిసిల్లలో కేసీఆర్ / కేటీఆర్కు ముఖ్యమైన అనుచరులు రంగంలోకి దిగడం ఖాయం.