అద్వానీకి దెబ్బా..? కుట్రా…?

రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి రేసులో ఉన్న బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే.అద్వానీకి ఇది నిజంగా షాక్ లాంటిదే. వివాదస్పద క‌ట్ట‌డం బాబ్రీమ‌సీదు కూల్చివేత కేసులో స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానంలో ఆయ‌న‌కు ఎదురు దెబ్బ త‌గిలింది. ఈ కేసులో అద్వానీతో పాటు ముర‌ళీమ‌నోహ‌ర్ జోషీ, ఉమాభార‌తితో స‌హా మొత్తం 16 మందిని కుట్ర‌దారులుగా సుప్రీంకోర్టు నిర్దారించింది. గ‌త రెండున్న‌ర ద‌శాబ్దాలుగా ఈ కేసు కొన‌సాగుతూనే ఉంది.

ఈ కేసులో అల‌హాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప‌క్క‌న పెట్టి ల‌క్నో ట్ర‌యిల్ కోర్టును కేసు విచారించాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించ‌డం సంచ‌ల‌న‌మైంది. ఈ కేసును ల‌క్నో ట్ర‌యిల్ కోర్టు విచార‌ణ‌కు ఆదేశించిన రెండు నెల‌ల్లోనే పూర్తి చేసేసింది. 1992 డిసెంబ‌ర్ 6న బాబ్రీ మ‌సీదును కూల్చివేసిన ఘ‌ట‌న‌లో రెండు కేసులో న‌మోదైంది. క‌ర‌సేవ‌కుల‌పై ఒక కేసు న‌మోద‌వ్వ‌గా, మ‌సీదు కూల్చివేత‌కు ప్రేరేపించార‌ని నాయ‌కుల‌పై మ‌రో కేసు న‌మోదైంది.

ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. సుమారు 25 ఏళ్లుగా కొనసా…గుతూ వ‌స్తోన్న ఈ కేసు ఇప్పుడు ఇంత స్పీడ్‌తో తెర‌మీద‌కు రావ‌డంపైనే రాజ‌కీయంగా దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసింది. ప్ర‌ధాన‌మంత్రి మోడీకి, బీజేపీ కురువృద్ధుడు అద్వానీకి మ‌ధ్య ఉన్న గ్యాప్ సంగ‌తి తెలిసిందే. అద్వానీ రాష్ట్ర‌ప‌తి అవ్వ‌డం ఇష్టంలేని మోడీయే ఈ కేసును తిర‌గ‌దోడార‌న్న విమ‌ర్శ‌లు విప‌క్షాల నుంచి వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

వాస్త‌వానికి రాష్ట్ర‌ప‌తి రేసులో అద్వానీనే ముందు నుంచి రేసులో ఉన్నారు. మోడీతో ఆయ‌న‌కు గ్యాప్ ఉన్న నేప‌థ్యంలో మోడీ అద్వానీని ఈ రేసు నుంచి తప్పించేందుకు అద్వానీ కేసును స్పీడ‌ప్ చేశార‌న్న చ‌ర్చ‌లు మీడియాలోను, రాజ‌కీయ‌వ‌ర్గాల్లోను వినిపిస్తున్నాయి. రాష్ట్ర‌ప‌తి రేసులో ద‌ళితుడి పేరు తెర‌మీద‌కు రావ‌డం వెన‌క కూడా మోడీయేన‌న్న టాక్ కూడా ఉంది. ఇక తాజాగా బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమా భారతికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో లాలూ ప్రసాద్ స్పందించారు.

వ‌చ్చే రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల రేసులో అద్వానీయే ఉంటార‌న్న చ‌ర్చ‌ల నేప‌థ్యంలో ఆయ‌న్ను రాష్ట్రపతి పదవికి పోటీలో లేకుండా చేసేందుకే మోడీ ఈ కుట్ర చేశార‌ని…ఈ విష‌యాన్ని ఎవ‌రైనా అర్థం చేసుకుంటార‌ని లాలూ అన్నారు. ఇక గుజ‌రాత్ సీఎంగా మోడీ ఉన్న‌ప్పుడు 2002లో అల్ల‌ర టైంలో మోడీని అద్వానీయే కాపాడార‌ని..కానీ ఇప్పుడు మోడీ అ విశ్వాసం కూడా లేకుండా సీబీఐను త‌న చెప్పు చేతుల్లో ఉంచుకుని అద్వానీని బాబ్రీ కేసులో ఇరికించార‌ని లాలూ ఫైర్ అయ్యారు. ఏదేమైనా రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల రేసులో అద్వానీ ఉన్న వేళ ఈ కురువృద్ధుడిపై దెబ్బ‌ప‌డ‌డం ఇది దెబ్బా ? లేదా కుట్రా ? అన్న‌ది ఇప్పుడు నేష‌న‌ల్ వైడ్‌గా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.