మల్టీప్లెక్స్ల్లో సినిమా చూస్తే ఆ సరదానే వేరు! పెద్దపెద్ద స్క్రీన్లు.. కార్పొరేట్ హంగులు.. ఇలా ఒక్కటేమిటి ప్రేక్షకుడిని ఒక వింతైన లోకంలోకి తీసుకుపోతాయి! మరి అంతలా విహరించేలా చేయాలంటే దానికి తగ్గట్టు డబ్బులు కూడా దోచేసుకుంటాయి. ప్రస్తుతం ఈ మల్టీప్లెక్స్ల దందాపై ఒక యాంకర్ థౌజండ్ వాలా `పటాస్`లా పేలాడు. ఇప్పటివరకూ మల్టీప్లెక్స్కి వెళ్లడం.. అక్కడి స్టాల్స్లో ఏదైనా కావాలంటే వాళ్లు అడినంత ఇచ్చి కొనుక్కోవడం తప్ప.. ఎందుకు ఇంత రేటు అని ఎవరూ అడగరు. దీనిపైనే ఈ యాంకర్ ప్రశ్నల వర్షం కురిపించాడు. సోషల్ మీడియా వేదికగా ప్రజలను ప్రశ్నించాడు.
యాంకర్ రవి అనడం కంటే `పటాస్` రవి అంటే అందరికీ గుర్తొస్తుంది. యాంకర్గా బాగా గుర్తింపు పొందిన వారిలో రవి కూడా ఒకడు. అయితే ప్రస్తుతం బాహుబలి ఫీవర్ మొదలైన నేపథ్యంలో మల్టీప్లెక్స్ థియేటర్లలోని స్టాల్స్లో భారీగా జనాలను దండుకునేందుకు సిద్ధమవుతున్నారు. సినిమాను చూడబోతున్నామన్న సంతోషం కొందరిలో ఉంటే, మరికొందరు మాత్రం మల్టీప్లెక్స్ థియేటర్లు ప్రేక్షకుడి జేబును గుల్ల చేస్తున్నాయని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లు మాత్రం కోర్టు తీర్పును సాకుగా చూపి, వినియోగదారుడిని అందిన కాడికి దోచుకుంటున్నాయి.
ఈ దందాపై యాంకర్ రవి సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. ఆలోచించకుండా ఎంత అడిగితే అంత ఇస్తున్నామని రవి చెప్పాడు. కానీ తన అభిప్రాయం ప్రకారం అడ్డంగా దోచేస్తున్నారని మండిపడ్డాడు. ‘‘బ్రెడ్ ముక్క, కొంచెం చీజ్, రెండు టొమాటో, కీర ముక్కల శాండ్విజ్ 70 రూపాయలు. పాప్కార్న్ 300 నుంచి రూ. 350లట.. వాటర్ బాటిల్ 40 రూపాయలు. మల్టీప్లెక్స్ల్లో ఫుడ్కు విధిస్తున్న చార్జీలు ఇవి… వాలెట్ నుంచి డబ్బులు తీసుకోవడం వ్యాపారం… బట్టలు కూడా లాగేసుకోవడం దారుణం.. నా వాదనతో ఏకీభవిస్తున్నారా’’ అని నెటిజన్లను యాంకర్ రవి ప్రశ్నించాడు.
నెటిజన్లు రవి వాదనతో ఏకీభవిస్తూనే, యాంకరైన రవినే ఇంత ఆలోచిస్తుంటే… ఇక సగటు సినీ ప్రేక్షకుడి ఆవేదన గురించి వర్ణించడానికి మాటలు చాలవని నిట్టూరుస్తున్నారు. మరి వీటిపై ఎవరూ చర్యలు తీసుకోకపోవడంతో వీరు ఇలా ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెట్టేస్తున్నారు.