బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు దేశ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన విషయం ఆయనకు ఆయన కుటుంబానికీ ఆనందాన్ని ఇచ్చేదే. అయితే, వీరికన్నా ఎక్కువగా వెంకయ్య ఏపీ నుంచి వెళ్లిపోతే బాగుండును అని అనుకునేవారే మరింత ఎక్కువగా ఆనందిస్తున్నారు. హమ్మయ్య వెంకయ్య ఇక ఏపీ జోలికి రాడు కాబట్టి హ్యాపీ అని ఏపీ బీజేపీలోని కొందరు నేతలు ఆనందంగా పండగ చేసుకుంటున్నట్టు సమాచారం. విషయంలోకి వెళ్తే.. ఏపీ బీజేపీని అన్ని విధాలా ముందుండి నడిపిస్తున్నారు వెంకయ్య నాయుడు.
కేంద్రంలో మంత్రి గా ఉన్నప్పటికీ.. ఆయన రాష్ట్రంలోని రాజకీయాలపై పట్టును కోల్పోకుండా ఇక్కడి నేతలకు దిశానిర్దేశం చేస్తూ.. అటు నేతలను, ఇటు పార్టీని కూడా నడిపిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడంలో ఆయన కీలకంగా ఉన్నారు. హోదా విషయంలో రగడ తలెత్తినా టీడీపీ నేతలు, బీజేపీ నేతలూ బహిరంగ విమర్శలు చేసుకున్నా.. వెంకయ్య సర్ది చెబుతూ సమన్వయం పాటించేలా చేశారు. అయితే, ఈ విషయంలో వెంకయ్యతో విభేదించేవారూ బీజేపీ ఉన్నారు. టీడీపీ పొత్తు లేకుండా మనం సొంతంగా ఎదుగుదామని బోధించేవారు కూడా ఎక్కువగా ఉన్నారు.
అయితే, కేంద్రంలో వెంకయ్య చక్రం తిప్పుతున్నందున వీరి మాటలను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈ వరుసలో ఇటీవల కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీలో చేరిన కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీ నారాయణ, పురందేశ్వరి, సోము వీర్రాజు వంటి కీలకమైన నేతలు న్నారు. వీరికి బీజేపీని చంద్రబాబుతో కలపడం ఎంత మాత్రమూ ఇష్టంలేదు. ఈ నేపథ్యంలో వారు ఇటీవల విజయవాడలో అమిత్ షా మీటింగ్ పెట్టినప్పుడు తమ అబిప్రాయాలను కొందరు యువకులతో పరోక్షంగా చెప్పించారు. అయినా కూడా వెంకయ్య మాటనే కేంద్రం వింటూవస్తోంది.
ఇక, ఇప్పుడు వెంకయ్య ఉపరాష్ట్రపతి పీఠం ఎక్కుతున్నారని వార్త రావడంతో ఈ ముఠా మొత్తం హ్యాపీగా ఫీలవుతోంది. బీజేపీలో తమ మాట ఇకపై నెగ్గుతుందని, రాష్ట్రలో ఏపీ సొంతంగా ఎదుగుతుందని వారు భావిస్తున్నారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య రాజ్యసభ వ్యవహారాలకే పరిమితం అవుతారు కాబట్టి.. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పాత్ర ఏమీ ఉండదు కాబట్టి తమకు ఛాన్స్ చిక్కినట్టేనని అనుకుంటున్నట్టు సమాచారం. మరి ఏంజ రుగుతుందో చూడాలి. మొత్తానికి ఇప్పటి వరకు చూస్తూ.. వీరంతా హ్యాపీ గా ఫీలవుతున్నారని తెలుస్తోంది.