రాష్ట్రంలో మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు వ్యవహారంతో పాలిటిక్స్ అన్నీ ఒక్కసారిగా బ్రాహ్మణుల చుట్టూ చేరిపోయాయి. బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి ఐవైఆర్ను తొలగించడాన్ని తీవ్రస్థాయిలో తప్పుపడుతున్న విపక్షం వైసీపీ.. ఈ విషయానికి కాస్త పొలిటికల్ కలరింగ్ ఇచ్చి బెనిఫిట్ పొందేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. మరోపక్క, చంద్రబాబుపై పీకల్లోతు ఆగ్రహంతో ఉన్న కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కూడా ఇప్పుడు బ్రాహ్మణులను సెంట్రిక్గా తీసుకుని కామెంట్లు చేశారు.
2019లో బ్రాహ్మణులు అంతా ఏకమై బాబుకు తడాఖా చూపించాలని పిలుపునిచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఏదైనా సందర్భం వస్తే తప్ప.. రాష్ట్రంలో బ్రాహ్మణులు అంటూ ఓ సామాజిక వర్గం ఉందన్న విషయం ఈ పొలిటికల్ నేతలకు గుర్తుకు రాకపోవడం గమనార్హం. రాష్ట్రంలో అగ్రవర్ణ జాబితాలో 5% మంది బ్రాహ్మణులు ఉన్నారు. వీరు అన్ని పార్టీలకూ ఓటు బ్యాంకు గా కూడా ఉపయోగ పడుతున్నాయి. అయితే, వీరికి ఎక్కడా పొలిటికల్గా మాత్రం ప్రాధాన్యం దక్కడం లేదు.
మిగిలిన అగ్రవర్ణాలైన కమ్మ, కాపులతో పోల్చుకుంటే బ్రాహ్మణులకు కనీసం 1% కూడా పొలిటికల్గా ఇంపార్టెన్స్ లేదు. వైసీపీ తరఫున ఒక్క కోన రఘుపతి మాత్రమే అసెంబ్లీలో గళం వినిపిస్తుండగా.. టీడీపీలో ఒక్కరు కూడా ఈ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నవారు లేకపోవడం గమనార్హం.
బహుశ దీనిని గమనించే మాజీ సీఎస్ కృష్ణారావు పదేపదే బ్రాహ్మణులు కూడా పాలిటిక్స్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఏదేమైనా.. ఇప్పుడు మాత్రం బ్రాహ్మణులను కేంద్రంగా చేసుకుని పాలిటిక్స్ చేస్తున్నవాళ్లు.. కనీసం 2019లో నైనా వారికి పొలిటికల్గా గుర్తింపు ఇస్తారో లేదో చూడాలి.