ఒక పక్క బాబాయి.. మరో పక్క సొంత బావ! ఇప్పుడు ప్రిన్స్ మహేష్కి పెద్ద అగ్నిపరీక్షగా మారిపొయింది పరిస్థితి. వీరిద్దరూ ఇప్పుడు మహేష్ను చెరోపక్క వాయించేస్తున్నారని సమాచారం. దీనికి కారణం.. ఇద్దరూ చెరో పార్టీ కావడం, ఇద్దరూ మహేష్ మద్దతు కోరుకోవడమే. బాబాయి ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, బావ గల్లా జయదేవ్ల వైఖరితో మహేష్ ఇప్పుడు నానాతిప్పలు పడుతున్నాడని అంటున్నారు ఫిలింనగర్ జనాలు. వీరిద్దరూ అధికార, విపక్ష పార్టీలకు చెందిన నేతలు కావడంతో మహేష్ ఇద్దరినీ.. సంతృప్తి పరచలేక సతమతమవుతున్నాడట.
ప్రస్తుతం నంద్యాల ఉప పోరుముగిసినా.. ప్రతిష్టాత్మకమైన కాకినాడ కార్పొరేషన్ మిగిలింది. దీంతో ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ, టీడీపీలు ఓటర్లను ఏదో ఒక విధంగా తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రచారం ఉద్రుతం చేయడంతోపాటు.. తమకు అనుకూలంగా ఉన్న స్టార్లతో కూడా ప్రచారం చేయిస్తున్నారు. లేకపోతే, వారి పిలుపునైనా అందుకుని అభిమానులు తమ కు ఓటేసేలా చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మహేష్కు ఇంటిపోరు ఎక్కువైందట.
తమ వాడు వైసీపీతోనే ఉంటాడని మొన్నామధ్య ఆదిశేషగిరిరావు నంద్యాల సాక్షిగా ప్రకటించారు. మహేష్ అభిమానులతో వైసీపీకి ఓటేసే ప్రతిజ్ఞ చేయించిన పనిచేశారు. అయితే, వారు వైసీపీకే ఓటేశారా? లేదా? అన్న విషయం రేపుకానీ తేలదు. ఇక, గల్లా జయదేవ్.. శ్రీమంతుడు అందరి వాడంటూ.. పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అధికార టీడీపీకే మమేష్ కొమ్ముకాస్తాడంటూ మీడియాతో నిన్న చెప్పుకొచ్చాడు. దీనిని బట్టి.. మహేష్ అటు వైసీపీకి మద్దతిస్తున్నాడని అనుకోవాలా? లేక.. ఇటు టీడీపీకి మద్దతిస్తున్నాడని సరిపెట్టుకోవాలా?
ప్రస్తుతం జరుగుతున్న ఈ చోటా ఎన్నికలతోనే పరిస్థితి ఇలా ఉంటే.. రాబోయే 2019 ఎన్నికలలో పరిస్థితి ఏంటి? అసలు ఇంత వరకు ఎవరితోనూ మాట అనిపించుకోని మహేష్.. ఇప్పుడు పొలిటికల్గా తన ప్రమేయం ఏమీ లేకుండానే ఇలా రెండు పార్టీల మధ్య ఇరుకున పడిపోవడం ఏమిటి? రాబోయే రోజుల్లో పరిస్తితి ఇంకెంతగా మారిపోతుంది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు మహేష్ను కూడా వెంటాడుతున్నాయట. మరి ఏంజరుగుతుందో చూడాలి. మొత్తానికి మహేష్ అయితే, ఇప్పటి వరకు తాను ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ, అటు బాబాయి, ఇటు బావ ప్రకటనలే అయోమయం క్రియేట్ చేస్తున్నాయి.