సంచలన వ్యాఖ్యలకు మారుపేరైన మంత్రి అయ్యన్నపాత్రుడు.. మరోసారి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందా ? జనసేన ఈసారి టీడీపీ-బీజేపీతో కలుస్తుందా? అనే సందేహాలు ఇప్పటివరకూ అందరిలోనూ ఉన్నాయి. వీటన్నింటికీ సమాధానం ఇస్తూ.. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ,బీజేపీ, జనసేన కలిసి పోటీచేస్తాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరి జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు? పవన్ అడిగినన్ని సీట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ఒప్పుకుంటారా? అనే ప్రశ్నలు మెదులుతుండగానే మంత్రి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపాయి.
ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవు. కానీ మూడేళ్లుగా ఏపీలో ఇలాంటి పరిస్థితే ఉంది. టీడీపీ-బీజేపీ నాయకత్వాల మధ్య ఎటువంటి విభేదాలు పైకి కనిపించేంతగా లేకపోయినా.. రెండు పార్టీల్లోని శ్రేణుల మధ్య కొంత గ్యాప్ మాత్రం కొనసాగుతోంది. అలాగే 2014లో బీజేపీ-టీడీపీకి సపోర్టు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇప్పుడు రాష్ట్రానికి చేసిన మోసంతో అమీతుమీకి సిద్ధమయ్యాడు. అలాగే 2019లో ఒంటరిగానే పోటీచేస్తానని ప్రకటించి సంచలనమే సృష్టించాడు. మరి ఈ పరిస్థితుల్లో టీడీపీకి 2019 ఎన్నికలు కత్తిమీదసాము లాంటివే!
ఈ నేపథ్యంలో అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు కుదిపేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని ఆయన తెలిపారు. ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని, కావాలంటే పేపర్ మీద రాసుకోవాలంటూ అయ్యన్న పేర్కొన్నారు. మరి ఈ మూడు పార్టీలు కలిసి పోటీచేస్తే.. బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయించొచ్చు. పవన్కు ఎన్ని ఇస్తారనేది ఇప్పుడ చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా పవన్.. 50 సీట్ల వరకూ అడిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరి 2109 ఎన్నికల్లో పవన్ పై నమ్మకంతో అన్ని సీట్లు చంద్రబాబు ఎలా ఇవ్వగలరు? అనేది ప్రశ్న!
కాగా 2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తుందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. అంతేకాకుండా జనసేన ఇప్పుడు ఎన్డీయే భాగస్వామి పక్షం కాదని, పార్టీ నిర్మాణం పూర్తయ్యాకే పొత్తుల గురించి ఆలోచిస్తామన్నారు. మరోవైపు మంత్రి అయ్యన్న వ్యాఖ్యలపై జనసేన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి అయ్యన్న వ్యాఖ్యలు ఎంతవరకూ ఫలిస్తాయో వేచిచూడాల్సిందే!!