ఏపీలోని నంద్యాల నియోజకవర్గంలో రాజకీయాలు థ్రిల్లర్ పాలిటిక్స్ను తలపిస్తున్నాయి. నిన్నటి వరకు టీడీపీలో ఉప ఎన్నికల్లో సీటు కోసం భూమా వర్గం వర్సెస్ శిల్పా వర్గాల మధ్య ఓ రేంజ్లో ఫైట్ నడిచింది. చివరకు చంద్రబాబు సైతం వీరిలో ఎవరికి టిక్కెట్టు ఇవ్వాలో తెలియక నాన్చుతూ వచ్చారు. తాజాగా మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరడంతో ఇప్పుడు ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది.
నిన్నటి వరకు నంద్యాల టిక్కెట్టు ఎవరికి ఇవ్వాలో తెలియక చంద్రబాబు టెన్షన్ పడితే ఇప్పుడు ఆయన రిలాక్స్ అవ్వగ జగన్కు టెన్షన్ పట్టుకుంది. శిల్పా బుధవారం వైసీపీలో చేరుతున్నారు. ఆయన ఉప ఎన్నికల్లో టిక్కెట్టు కోసమే వైసీపీలో చేరుతున్నారన్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు వైసీపీలో టిక్కెట్ కోసం ఫైటింగ్ స్టార్ట్ అయ్యింది.
ఇప్పటికే వైసీపీ తరపున నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆ పార్టీ నంద్యాల నియోజకవర్గ ఇన్ ఛార్జి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. గంగుల అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకే వైసీపీలో చేరారు. తీరా ఇప్పుడు శిల్పాకు టిక్కెట్ ఇస్తే ఆయన భగ్గుమనడం ఖాయం.
శిల్పా మోహన్రెడ్డి వైసీపీలో చేరితే నంద్యాలలో వైసీపీ బలోపేతం అవుతుందని భావించిన జగన్ ఆయన్ను పార్టీలో చేర్చుకున్నారు. శిల్పా అలా పార్టీలో చేరుతున్నారో లేదో నంద్యాలలో ప్రస్తుత ఇన్చార్జ్ రాజగోపాల్ రెడ్డి, గంగుల ప్రతాప్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికిప్పుడు పార్టీలో చేరిన వారికి పదవులు ఎలా ఇస్తారని వాళ్లు జగన్ను ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి శిల్పా వైసీపీలో చేరడంతో చంద్రబాబుకు పెద్ద రిలాక్స్ లభించినట్లయ్యింది. ఇక అదే టైంలో జగన్కు ఇప్పుడు పెద్ద తలనొప్పి మొదలైంది.