ప్రస్తుతం టీడీపీ నేతల్లో విస్తృతంగా చర్చకు దారితీస్తున్న పదవి… టీటీడీ చైర్మన్. దీనికి విపరీతమైన పోటీ ఉంది. ఈ విషయంలోనే రాజమండ్రి, నరసరావు పేట ఎంపీల మధ్య పెద్ద అంతర్గత యుద్ధమే జరిగింది. దీనికి చంద్రబాబు తన స్టైల్లో ఫుల్ స్టాప్ పెట్టడంతో.. పేట ఎంపీ రాయపాటి సాంబశివరావు బాబుపై అలిగాడు కూడా. అలాంటి కీలకమైన పోస్టును చంద్రబాబు ఇప్పుడు తన బావగారైన సీతయ్య.. నందమూరి హరికృష్ణకు అప్పగించాలని భావిస్తున్నారట!! ప్రస్తుతం ఈ వార్త హల్ చల్ చేస్తోంది. అయితే, దీనిపై హిందూ పురం ఎమ్మెల్యే, తన వియ్యంకుడు అయిన బాలకృష్ణ సలహా తీసుకోవాలని బాబు డిసైడ్ అయినట్టు తమ్ముళ్లు చెప్పుకొంటున్నారు.
అంటే, బాలయ్య సలహా మీద హరికృష్ణకు చైర్మన్ పోస్ట్ ఇవ్వాలా? వద్దా? అని బాబు నిర్ణయిస్తారన్నమాట. ఇంత వరకు బాగానే ఉన్నా.. బాలయ్య ఇప్పుడు ఈ విషయంలో ఊ.. అంటాడా? ఊహూ.. అంటాడా అనేది ఆస్తకిగా మారింది. ఇటీవల పరిణామాలను గమనిస్తే.. బాలయ్యలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. అధికారంలో ఉన్న బావ కం వియ్యంకుడైన బాబుపైన, అల్లుడు లోకేశ్పైనా బాలయ్య ఎక్కువ ప్రేమ కుమ్మరించేస్తూ.. అయిన అన్నయ్య, కొడుకులను దూరం పెడుతున్నాడని తెలుస్తోంది.
ఇటీవల పోర్చ్గల్లో తన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్థావన తీసుకురాగా.. మౌనం వహించాడు బాలయ్య. అదేవిధంగా దీనికి ముందు జరిగిన మహానాడులోనూ అందరినీ పేరు పేరునా పలకరించిన బాలయ్య.. హరికృష్ణకు చిరునవ్వుతో సరిపెట్టారని కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితిలో బాలయ్య.. హరికృష్ణకు పచ్చజెండా ఊపుతాడా? అనేది సందేహమే. మరి ఈ విషయంలో ఏ జరుగుతుందో తెలియాలంటే.. బాలయ్య ఇండియాకు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే!