గంటా చేతిలో వియ్యంకుడి భవితవ్యం

ఏపీ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాస‌రావు రూటే స‌ప‌రేటు. ఆయ‌న ఎన్ని పార్టీలు మారినా గెలుస్తూనే ఉంటాడు…ఏ పార్టీ మారినా మంత్రిగానే ఉంటాడు. ఆయ‌న గ‌త ప‌దేళ్ల‌లో టీడీపీ – ప్ర‌జారాజ్యం – కాంగ్రెస్ – తిరిగి టీడీపీ ఇలా ప‌లు పార్టీలు మారారు. గ‌త కాంగ్రెస్ పాల‌న‌లో మంత్రిగా ఉన్న గంటా గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలోకి జంప్ చేసి ఇక్క‌డ గెలిచి ఇక్క‌డ కూడా మంత్రి అయ్యారు. కేబినెట్‌లో మ‌రో మంత్రిగా ఉన్న నారాయ‌ణ గంటాకు వియ్యంకుడు. ఇదిలా ఉంటే గంటాకు మ‌రో వియ్యంకుడిగా ఉన్న ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం ఎమ్మెల్యే పుల‌ప‌ర్తి అంజిబాబు సీటుకు ఎర్త్ రెడీ అవుతోందా ? అంటే ప్ర‌స్తుతం భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ టీడీపీలో జ‌రుగుతోన్న ప‌రిణామాలు, అక్క‌డ రాజ‌కీయ వ‌ర్గాల చ‌ర్చ‌లు అవున‌నే అంటున్నాయి.

2009లో పారిశ్రామిక‌వేత్త‌గా ఉన్న అంజిబాబు కాంగ్రెస్ త‌ర‌పున భీమ‌వ‌రం ఎమ్మెల్యేగా ఫ‌స్ట్ టైం గెలిచారు. గ‌త ఎన్నిక‌లకు ముందు గంటాతో పాటు క‌లిసి ఆయ‌న కూడా టీడీపీలోకి జంప్ చేసేశారు. అంజిబాబుకు సౌమ్యుడిగా పేరున్నా ఆయ‌న మైండ్ రాజ‌కీయాల‌పై క‌న్నా వ్యాపార‌ధోర‌ణిలోనే ఎక్కువుగా ర‌న్ అవుతుంద‌న్న కామెంట్లు కూడా ఉన్నాయి. రాజ‌కీయంగా అంజిబాబు వ‌ల్ల టీడీపీకి ఒరిగిందేమి ఉండ‌దు. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల‌కు ముందే అంజిబాబు మ‌రోసారి గెలిచే ప‌రిస్థితి లేదు. అయితే ఆయ‌న అనూహ్యంగా పార్టీ మార‌డం…జిల్లాలో బ‌లంగా వీచిన టీడీపీ వేవ్‌లో ఆయ‌న విన్ అయ్యాడు.

అయితే ప్ర‌స్తుతం భీమ‌వ‌రం పొలిటిక‌ల్ టాక్ ప్ర‌కారం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు మరోసారి టీడీపీ టిక్కెట్టు వ‌స్తుందా ? అంటే డౌటే అంటున్నారు. గంటా గ్యాంగ్ జ‌న‌సేన‌లోకి జంప్ వార్తలు వ‌స్తున్నాయి. అదే జ‌రిగితే అంజిబాబు కూడా జ‌న‌సేన‌లోకి వెళ్లిపోవ‌డం ఖాయం. నియోజ‌క‌వ‌ర్గంలో ఈ టాక్ కూడా బ‌లంగా వినిపిస్తోంది. ఇక టీడీపీ త‌ర‌పున వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి సీటు కోసం జిల్లా టీడీపీ అధ్య‌క్షురాలు , రాజ్య‌స‌భ స‌భ్యురాలు అయిన తోట సీతారామ‌ల‌క్ష్మి త‌న‌యుడు తోట జ‌గ‌దీశ్ ట్రై చేస్తున్నారు. సీతారామ‌ల‌క్ష్మికి చంద్ర‌బాబు వ‌ద్ద మంచి నేమ్ ఉండ‌డంతో పాటు వ‌రుస‌గా ఐదోసారి జిల్లా పార్టీ ప‌గ్గాలు చేపట్ట‌డంతో జ‌గ‌దీశ్‌కు ప్ల‌స్‌గా మారింది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న త‌న‌యుడికి భీమ‌వ‌రం అసెంబ్లీ సీటు ఇప్పించుకునేందుకు తోట తెర‌వెన‌క అప్పుడే ప్ర‌య‌త్నాలు స్టార్ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక ప్ర‌స్తుత భీమ‌వ‌రం మునిసిప‌ల్ చైర్మ‌న్ కొటిక‌ల‌పూడి గోవింద‌రావు సైతం వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం సీటుపై క‌న్నేశారు. అంజిబాబు నియోజ‌క‌వ‌ర్గంలో స్పీడ్‌గా లేక‌పోవ‌డంతో పాటు ఆయ‌న నిర్లిప్త‌త వీరికి క్యాష్ కానున్నాయి.

ఇక అంజిబాబు జ‌న‌సేన‌లోకి వెళితే వీరిద్ద‌రిలో ఒక‌రికి టీడీపీ సీటు ఖాయం. అంజిబాబు టీడీపీలో ఉన్నా ఆయ‌న‌కు మ‌రోసారి చంద్ర‌బాబు ఎంత వ‌ర‌కు సీటు ఇస్తార‌న్న‌ది కూడా డౌటే. జ‌గ‌దీశ్, గోవింద‌రావు ఇద్ద‌రూ నెక్ట్స్ టీడీపీ రేసులో ఉన్నా జ‌గ‌దీశ్ వైపే మొగ్గు ఎక్కువుగా క‌నిపిస్తోంది.