కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ ప్రభావం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గం భూమా ఫ్యామిలీకి కంచుకోట. ఈ నియోజకవర్గం భూమా ఫ్యామిలీకి ఎంత బలమైన నియోజకవర్గం ఏంటంటే ఇక్కడ ఐదుసార్లు గెలిచిన దివంగత భూమా నాగిరెడ్డి సతీమణి, దివంగత శోభా నాగిరెడ్డి టీడీపీ – ప్రజారాజ్యం – వైసీపీ ఇలా ఎన్ని పార్టీలు మారినా ఆమే గెలిచింది. ఇక్కడ పార్టీ ఇమేజ్ కంటే భూమా ఫ్యామిలీ ఇమేజే గట్టిగా పనిచేసిందని స్పష్టమవుతోంది.
ఇక ఇక్కడ గత ఎన్నికలకు ముందే చనిపోయిన శోభ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా గెలిచి రికార్డు సృష్టించారు. శోభ మృతితో ఆమె వారసురాలిగా ఆమె కుమార్తె అఖిలప్రియ ఎంట్రీ ఇవ్వడం, ఆ తర్వాత అనుకోకుండా నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్డి కూడా మృతి చెందడంతో అఖిలప్రియ అనూహ్యంగా మంత్రి అయ్యారు. మూడేళ్లపాటు ఎమ్మెల్యేగా అనుభవం, ఐదు నెలలు మంత్రిగా ఉన్న అఖిలప్రియ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అన్ని తప్పటడుగులే వేస్తున్నారు.
నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా చూసుకుంటే సాధారణ అభివృద్ధే తప్ప మంత్రిగా ఆమెకు ఆళ్లగడ్డకు ప్రత్యేకత చూపించిందేమి లేదు. వెనకబడిన ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నా ఆమె ఆ దిశగా ఏ మాత్రం ప్రత్యేకంగా దృష్టి సారించడం లేదు. ఇక రాజకీయంగా ఆమె తల్లిదండ్రులు చనిపోయిన సానుభూతి ఉన్నా ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తూ, స్థానిక నాయకులను కలుపుకు వెళ్లకుండా ఫ్యామిలీ క్రేజ్ను క్యాష్ చేసుకోవడంలో దారుణంగా విఫలమవుతోందన్న విమర్శలు సర్వత్రా ఉన్నాయి.
రాజకీయంగా అస్సలు అనుభవం లేకపోవడం, సీనియర్లు చెప్పింది కూడా వినట్లేదన్న టాక్ వచ్చేసింది. ఇక నంద్యాల ఉప ఎన్నికలో కూడా ఆమె తీరు సరిగా లేకపోవడం, భూమా రైట్ హ్యాండ్ ఏవీ.సుబ్బారెడ్డి లాంటి వాళ్లను పక్కన పెట్టేయడంతో చంద్రబాబుకు అఖిలప్రియపై నెగిటివ్గా ఇప్పటికే చాలా రిపోర్టులు చేరాయి. చంద్రబాబు సైతం అఖిలప్రియను నమ్మని పరిస్థితి. ఇక ఆమె ఉప ఎన్నిక ప్రచారంలో ప్రస్తుతం యాక్టివ్గానే పాల్గొంటున్నా ముందు వరకు ఎక్కువుగా బెంగళూరుకే పరిమితమవ్వడం కూడా ఆమెకు మైనస్. ఆమె బెంగళూరు విషయాలు కర్నూలు జిల్లాలో ఇప్పుడు జోరుగా చర్చలకు వచ్చాయి.
ప్లస్ పాయింట్స్ (+):
– చిన్న వయస్సులోనే మంత్రి పదవి రావడం
– బలమైన భూమా ఫ్యామిలీకి ఉన్న అనుచరగణం
– భూమా దంపతులపై ఉన్న సానుభూతి
మైనస్ పాయింట్స్ (-):
– కార్యకర్తలకు అందుబాటులో ఉండరని ఆరోపణ
– ఎవ్వరు ఫోన్ చేసినా స్పందన లేకపోవడం
– స్థానిక నాయకులతో సంబంధం లేకుండా వ్యవహరించడం
– రాజకీయ అనుభవం లేకపోవడం
– వైసీపీ నుంచి బలమైన ప్రత్యర్థి ఉండడం
– నియోజకవర్గంలో వైసీపీ బలంగా ఉండడం
తుది తీర్పు :
తల్లి దివంగత శోభ మరణంతో అనూహ్యంగా ఎమ్మెల్యే అయ్యి, తండ్రి భూమా మరణంతో మంత్రి అయిన అఖిలప్రియ రాజకీయ అనుభవలేమితో రాంగ్ స్టెప్పుల మీద రాంగ్ స్టెప్పులు వేస్తున్నారు. ఇక నియోజకవర్గంలో వైసీపీ చాలా బలంగా ఉంది. వైసీపీ ఇన్చార్జ్ గంగుల ప్రభాకర్రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. గంగుల సోదరులు మొత్తం ఐదుగురు. వారిని ఇక్కడ తట్టుకోవడం కష్టం. కాకలు తీరిన గంగుల పంచసోదరుల ఎత్తుల ముందు అఖిలప్రియ ఏమాత్రం సరితూగదు.
ఇక అఖిలప్రియకు తప్పనిసరి పరిస్థితుల్లో మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని కర్నూలు జిల్లాలో వినిపిస్తోన్న టాక్. 2019 ఎన్నికల్లో నంద్యాలలో భూమా నాగిరెడ్డి రైట్ హ్యాండ్ ఏవి.సుబ్బారెడ్డికి టిక్కెట్టు ఇచ్చి ప్రస్తుతం ఉప ఎన్నికల్లో అక్కడ పోటీ చేస్తోన్న భూమా అన్న కొడుకు బ్రహ్మానందరెడ్డిని ఇక్కడ బరిలో దింపుతారని చర్చలు నడుస్తున్నాయి. అఖిలప్రియ ఇదే రూట్లో వెళితే వచ్చే ఎన్నికల్లో గంగుల సోదరులను తట్టుకోవడం కష్టం. బ్రహ్మానందరెడ్డి ఇక్కడ పోటీ చేసినా వచ్చే ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదు. ఇక్కడ వైసీపీ బలంగా ఉండడం, గంగుల లాంటి బలమైన ప్రత్యర్థులు ఉండడంతో ఆళ్లగడ్డ పోరు అదిరిపోక తప్పదు.