ప్రస్తుతం ఏపీలో టీడీపీతో అధికారం పంచుకున్న బీజేపీ నేతలు 2019 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ రథసారథి.. అమిత్ షా.. నిన్న ఏపీలో పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. అయితే, ఇక్కడ ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది. టీడీపీతో పొత్తు వద్దంటూ పలువురు నేతలు, కార్యకర్తలు షా సభలో, బయటా కూడా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. టీడీపీని వదిలేద్దాం అని షాకు చెప్పకనే చెప్పారు.
విజయవాడలో గురువారం కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికేì కొందరు నేతలు టీడీపీతో పొత్తుపై నిరసన వ్యక్తం చేశారు. లీవ్ టీడీపీ(తెలుగుదేశం పార్టీని వదిలించుకుందాం).. సేవ్ బీజేపీ(భారతీయ జనతా పార్టీని రక్షించుకుందాం)… వుయ్ వాంట్ బీజేపీ సీఎం(మాకు బీజేపీ ముఖ్యమంత్రి కావాలి) అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. కొందరు నినాదాలు చేశారు.
ప్లకార్డులు ప్రదర్శిస్తున్న నేతలను భద్రతా సిబ్బంది బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. అమిత్ షా తన పక్కనే ఉన్న నేతలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తూ నేతలు ప్లకార్డులు ప్రదర్శించే సమయంలోనే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రసంగం ప్రారంభించారు. ప్లకార్డులు ప్రదర్శించే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూర్చోవాలని చెప్పారు.
ఈ పరిణామం ఇప్పుడు ఏపీలో పెద్ద చర్చకు దారితీసింది. నిజానికి 2019లోనూ టీడీపీతోనే కలిసి ప్రయాణించాలని బీజేపీ భావిస్తోంది. అయితే, బీజేపీలోని కొందరు నేతలు మాత్రం బాబు పంచన వద్దని .. స్వతంత్రంగా ఎదుగుదామని అంటున్నారు. దీనిని వారు షాకే నేరుగా తెలిసేలా చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోపక్క ఏపీలో టీడీపీ చేసిందానికన్నా ఢిల్లీ గద్దెపై కూర్చున్న మోడీనే ఏపీకి ఎక్కువ చేశారంటూ షా చెప్పడం కూడా చర్చకు దారి తీసింది. దీంతో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణాలు జరుగుతాయో చూడాలి.