గ్రేటర్ లో పాగా వేసేందుకు బీజేపీ బడా ప్లాన్

తెలంగాణ‌లో తిరుగులేకుండా జెట్ రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతోన్న అధికార టీఆర్ఎస్ దూకుడును నిలువ‌రించేందుకు విప‌క్ష బీజేపీ స‌రికొత్త అస్త్ర‌శ‌స్త్రాల‌తో సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే బీజేపీ తెలంగాణ‌లో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాలు, ప‌ట్ట‌ణాల్లో బ‌లోపేతం అయ్యేంద‌కు చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. టీఆర్ఎస్ బ‌ల‌హీనంగా ఉన్న గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ను బీజేపీ మెయిన్‌గా టార్గెట్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది.

ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన సీనియ‌ర్ నాయ‌కులు అయిన మాజీ మంత్రులు దానం నాగేంద‌ర్‌, ముఖేష్‌గౌడ్‌, మాజీ ఎంపీ అంజ‌న్‌కుమార్ యాద‌వ్‌ల‌ను త‌మ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ స్కెచ్ గీసిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా త్వ‌ర‌లోనే తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో తెలంగాణ‌లో పార్టీ పటిష్టత‌తో పాటు ఈ ముగ్గురు త్ర‌యంను పార్టీలో చేర్చుకునే అంశంపై ప్ర‌ధానంగా చ‌ర్చించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

వీరితో పాటు తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియ‌ర్లుగా ఉన్న గ‌ద్వాల్ ఎమ్మెల్యే డీకే.అరుణ‌, వ‌న‌ప‌ర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే సంప‌త్‌కుమార్‌ల‌ను కూడా త‌మ పార్టీలో చేర్చుకుని వారికి కొన్ని హామీలు ఇచ్చే అంశంపై కూడా టీ బీజేపీ నాయ‌కులు జాతీయ నాయ‌క‌త్వంలో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌న్న వార్త‌లు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి.

దానం, ముఖేష్‌, అంజ‌న్‌ల‌ను పార్టీలో చేర్చుకుని వారికి గ్రేట‌ర్‌లో ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వ‌డం ద్వారా గ్రేట‌ర్‌లో టీఆర్ఎస్‌ను తిరుగులేని దెబ్బ‌కొట్టాల‌న్న‌దే బీజేపీ మెగాప్లాన్‌గా తెలుస్తోంది. మ‌రి ఈ ప్ర‌య‌త్నంలో టీ బీజేపీ నాయ‌కులు ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి.