పాలిటిక్స్ అన్నాక ఎక్కడికక్కడ మాటలు మారిపోతుండాలి. ఒకరిని ఇంద్రుడంటే.. మరొకరిని చంద్రుడనాలి. లేకపోతే.. పాలిటిక్స్లో పస ఉండదు! ఈ వైఖరిని బాగా అవలంబించుకున్న వారికి ఉపరాష్ట్రపతిగా వెళ్లిపోయిన మన తెలుగు వాడు వెంకయ్యనాయుడు ముందుంటారు. బాబును ఆయన పొగిడినట్టు బహుశ ఎవరూ పొగిడి ఉండరు. తన ప్రాసలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్న వెంకయ్య.. బాబుపై పొగడ్తలతో అటు బీజేపీ వాళ్ల కన్నా కూడా టీడీపీలోనే ఆయన ఫాలోయింగ్ పెంచుకున్నాడని అంటారు. ఇక, ఇప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్లిపోవడంతో ఆయన ప్లేస్ను బీజేపీకే చెందిన రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాసరావు భర్తీ చేశారు.
సీఎం చంద్రబాబును రాజమార్తాండ, రాజగంభీర స్టైల్లో అవకాశం వచ్చిన ప్రతిసారీ పొగిడేస్తున్నారు. అయితే, తాజాగా బీజేపీ పెద్దలకు ఆగ్రహం తెప్పించే రేంజ్లో కామినేని.. బాబుకి క్రీం బిస్కెట్ వేసేశారు. ఎంత క్రీమంటే.. బాబును ఏకంగా ప్రధాని మోడీ కన్నా.. తొపంటూ.. పొగిడేశారు. ఇటీవల విజయవాడలో ఇండో యూకే ఇన్ స్టిట్యూట్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ వేదిక మీద కామినేని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
సీఎం చంద్రబాబు పనితీరును మెచ్చుకోవడం వరకూ బాగున్నా.. మోడీ వల్ల కూడా కాని పనుల్ని చంద్రబాబు చేస్తున్నారని కామినేని అన్నారు. యూకే సంస్థ అమరావతికి రావడం వెనక చంద్రబాబు కృషి చాలా ఉందని చెప్పారు. గతంలో ప్రధాని ఇంగ్లండ్ వెళ్లారనీ, విద్యా వైద్య రంగాల్లో అభివృద్ధి కోసం ఆ దేశంతో చర్చలు జరిపారనీ, అప్పుడు అమరావతి ప్రస్థావన అస్సలు రాలేదని , అయితే, ఆ తరువాత, చంద్రబాబు కృషి కారణంగానే యూకే సంస్థ రాష్ట్రానికి వచ్చింది డప్పేశారు.
ప్రధానికి మించిన కృషి చేయడం వల్లనే ఈ సంస్థ ఇండియాకి వచ్చిందని.. అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా సవివరంగా కామినేని ప్రసంగించారు. కేంద్ర మంత్రులు కూడా ఉన్న ఆ వేదికపై కామినేని ఇలా ప్రసంగించడంతో బీజేపీ నేతలకు ఆగ్రహం తెప్పింది. ఈ కామెంట్లపై మోడీకి కామినేని గురించి ఫిర్యాదులు కూడా వెళ్లాయని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి కామినేని క్రీం వెనుక ఏదైనా పొలిటికల్ స్టంట్ ఉందేమో? అంటున్నారు విశ్లేషకులు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.