`మా అన్న ఓడిపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తా` అంటూ ప్రకటించిన నాటి నుంచి నంద్యాలలో గెలుపుకోసం అహర్నిశలు కష్టపడుతున్నారు భూమా నాగిరెడ్డి కూతురు, మంత్రి అఖిలప్రియ. ప్రచారంలో అంతా తానై వ్యవహరిస్తూ.. అన్న విజయానికి శ్రమిస్తున్నారు. ఇదే సమయంలో ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు పార్టీకి ఎక్కడ మైనస్ అవుతాయో అని నేతలు టెన్షన్ పడుతున్నారట. పార్టీ సీనియర్లతో చర్చించకుండా సొంతంగా ఆమె వ్యవహరించడం వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభముండదని తెగేసి చెబుతున్నారట. ప్రస్తుతం ఆమె వ్యవహారశైలి నంద్యాల ఓటర్లపై ప్రభావం చూపుతుందని టెన్షన్ పడుతున్నారట.
నంద్యాలలో టీడీపీ, వైసీపీ పోరు తీవ్రంగా ఉంది. విజయం కోసం ఎవరికి వారు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే టీడీపీ తరఫున ఇక్కడ గెలుపొందే బాధ్యత అంతా భూమా అఖిలప్రియపై పెట్టేశారు సీఎం చంద్రబాబు! అందుకే అన్న గెలుపును తన గెలుపుగా భావించి.. ప్రచారంలోకి దూకేశారు. తొలి నుంచి ఆమె వ్యవహార శైలిపై సీనియర్లు గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే! ఇప్పుడు ఇది మరింత తీవ్రమవుతోంది. ముఖ్యంగా పార్టీలో చేరుతున్న వారి విషయంలో ఆమె ఏమాత్రం తమను సంప్రదించడం లేదని వీరంతా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పార్టీలో చేరుతున్నారన్న సంతోషపడుతున్న సమయంలోనే మరోసారి అలకలు కూడా టీడీపీని కలవరపెడుతున్నాయి.
అఖిలప్రియ అవగాహన రాహిత్యంతో ఇన్ ఛార్జి మంత్రులు, సీనియర్లలో కలవరం బయలుదేరింది. ప్రస్తుతమున్న ఇన్ ఛార్జి మంత్రులకు నంద్యాల రాజకీయాలు పూర్తిగా కొత్త. ఎన్నికల సమయం కాబట్టి ఎవరినైనా చేర్చుకోవాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈ మేరకు నంద్యాలలో ఒక విద్యాసంస్థల అధినేత ఇంతియాజ్ ను అఖిలప్రియ పార్టీలో చేర్చుకున్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలోనే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఇంతియాజ్ వ్యతిరేక వర్గం ఇప్పుడు భూమా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మారింది. ఇంతియాజ్ ఒక విద్యాసంస్థకు అధిపతి అయితే… మరో విద్యాసంస్థకు అధిపతి అయిన రామకృష్ణారెడ్డి అలకబూనారు.
భూమా నాగిరెడ్డి వెంటే రామకృష్ణారెడ్డి ఉన్నారు. తనకు తెలియకుండా ఇంతియాజ్ ను పార్టీలో చేర్చుకోవడంపై రామకృష్ణారెడ్డి మండిపడుతున్నారు. ఈ విషయం తెలిసిన మంత్రులు ఆయన్నుబుజ్జగించినా ఫలితం లేకపోయిందట. ఈ పంచాయతీని భూమా నాగిరెడ్డి ప్రధాన అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు నేతలు. `ఏం మొహం పెట్టుకుని వెళ్లాలి. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు చేస్తుంటే.. రాజకీయాలు ఎలా చేయాలి?` అని మండిపడ్డారట. మంత్రి అఖిలప్రియ వల్లే ఇదంతా జరుగుతోందని, ఆమెకు చెప్పినా వినదు… తెలుసుకోదు అని విసుక్కోవడంతో మంత్రులు కూడా నిరాశగా వెనుదిరిగారట.