2019 ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు? గత ఎన్నికల్లో సీఎం కల ఆశకు కొద్ది దూరంలోనే నిలిచిపోయిన జగన్.. ఈసారైనా ఆ కుర్చీని అందుకుంటాడా? ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఎంత వరకూ ప్రభావం చూపగలడు? ఆయన నిర్ణయాలన్నీ పాటిస్తే జగన్ సీఎం కల నెరవేరుతుందా? అనే సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. అయితే ఇన్ని చేసినా 2019 ఎన్నికల్లో జగన్కు వచ్చే సీట్ల సంఖ్యపై సర్వేలు ఏం చెబుతున్నాయి అనే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. జగన్కు కల కలగానే మిగిలిపోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పకనే చెప్పేశారు!! అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన పలితాలే వచ్చాయట.
ఎన్నికల సందడి మొదలవగానే సర్వేల హడావుడి ప్రారంభమైపోతుంది. ఒక సర్వేలో ఒకరు, మరోసర్వేలో ఇంకొకరు గెలుస్తారని రావడం సర్వసాధారణమైన అంశమే! సర్వేలకు మారుపేరయిన చంద్రబాబు కూడా ప్రతి అంశంపై సర్వేలపైనే ఆధారపడతారు. అయితే 2019 ఎన్నికల్లోనూ ఎవరు గెలుస్తారనే అంశంపై ఇప్పుడు చాలా సర్వేలే వస్తున్నాయి. అయితే అన్నింటిలోనూ ఒకటే ఫలితం వస్తోందట. అదేంటంటే 2019 ఎన్నికల్లో వైసీపీకి కేవలం 30 సీట్లు వస్తున్నాయని సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు.
2019 ఎన్నికల హామీలను జగన్ ప్రకటించేశారు. ప్లీనరీ వేదికగా కార్యాచరణను కూడా వెల్లడించారు. అక్టోబర్ నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు కూడా చెప్పేశారు. అలాగే ఇంటింటికీ వైఎస్సార్ సీపీని తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రణాళిక వేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ కూడా ధీటైన కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా.. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. దీనిపై దిశానిర్దేశం చేసేందుకు పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ ఏర్పాటుచేశారు. ఇందులో వైసీపీ అధినేత జగన్పై మండిపడ్డారు. ఆ పార్టీకి 2019 ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై కూడా వ్యాఖ్యానించారు. వైసీపీకి కేవలం 30 సీట్లు వస్తాయని తేల్చిచెప్పారు.
ఇదే విషయాన్ని సర్వేలు చెబుతున్నాయని చంద్రబాబు అన్నారు. 2019 ఎన్నికలకు పార్టీ నేతలు ఇప్పటి నుంచే సిద్ధం కావాలన్నారు. వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రతిపక్షాలు రెచ్చగొట్టేలా మాట్లాడినా సంయమనం పాటించాలని కోరారు. జగన్ ఉన్మాదిలా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉండగానే ఇలా చేస్తుంటే.. అధికారంలోకి వస్తే మరెలా చేస్తారో అని వ్యాఖ్యానించారు. జగన్ ఎంత శాడిస్టో ఆయన వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయని పేర్కొన్నారు. `ఎందుకు నన్ను కాల్చి చంపాలి. నేను చేసిన పనులు ఏమిటి? జగన్ చేసిన పనులు ఏమిటి?` అని ప్రశ్నించారు.