ఏపీలో మంత్రి గంటా శ్రీనివాసరావు చుట్టూ అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఏదో ఒక ఆరోపణ సహజంగానే వస్తోంది. ఇప్పుడు కూడా ఆయన చుట్టూ భూకబ్జా ఆరోపణలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా రాష్ట్రం దృష్టిని ఆకర్షించిన విశాఖ భూ కుంభకోణాలు అన్నీ మంత్రి కనుసన్నల్లోనే సాగిపోతున్నాయట. ఆయన అనుచరులు కొందరు గంటా చెప్పిన ప్రకారం భూములను ఆక్రమించేసి.. వెంచర్లు వేసేస్తున్నారట. దీంతో మంత్రి గారి అవినీతి పుంఖాను పుంఖానులుగా రాజధానిలో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఈ ఆరోపణలు తనను ముసురుకుంటాయేమోనని సీఎం చంద్రబాబు ఒకింత జంకుతున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో గంటాకు టికెట్ ఇవ్వరాదని బాబు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
ఇక, మంత్రి గారి భూభాగోతం చూద్దాం.. ప్రస్తుతం విశాఖ నగరం భూదందాల విషయంలో అట్టుడుకుతోంది. ఈ దందాల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీలా గోవింద్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వీరిద్దరూ టీడీపీకి సీనియర్ నేతలుగా ఉండడం గమనార్హం. వందల, వేల ఎకరాల్ని ఎక్కడికక్కడ కంపలు, కంచెలు వేసి వాటిని రియల్ వెంచర్లుగా మార్చుస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఈ భూములపై అన్ని పక్షాల నుంచి ఆరోపణలు వెల్లువెత్తడంతో సీఎం చంద్రబాబు సిట్ను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా విశాఖ కుంభకోణంపై మంత్రి అయ్యన్నపాత్రుడు, మిత్రపక్షం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులే విరుచుకుపడ్డారు.
ఇక, గంటా పనితనం చూస్తే.. అనకాపల్లి నుంచి అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న భోగాపురం మీదుగా ఓ భారీ ఆరు రోడ్ల లైన్ పడుతోంది అన్న సమాచారం లీకవ్వగానే.. మొదటగా తెలుసుకున్న గంటా ఆయన అనుచరులు ఆ రోడ్డు పొడవునా .. చుట్టు పక్కల ఏరియాల్లో ఉన్న ఖాళీ స్థలాల్ని, బంజరు భూముల్ని కొన్నిటిని కొని, కొన్నిటిని ఆక్రమించుకుని, కొన్నిటిని కలిపేసుకుని మొత్తానికి చాలానే దందా నడిపించారని దర్యాప్తులో తేలుతోంది. ఇదే విషయాన్ని ఆనందపురం, భీమిలి, పెందుర్తి (విశాఖ ఔట్స్కర్ట్స్-40 కి.మీల పరిధి) మండలాల్లో స్థానిక ప్రజలు మాట్లాడుకుంటున్నారు. సిట్ విచారణ ఈ మండలాల్లోనే జరుగుతోంది.
సో.. ఎలా చూసినా.. మంత్రి గంటా ఆయన అనుచరులు పెద్ద ఎత్తున భూ భాగోతంలో మునిగిపోయారని స్పష్టమవుతోంది. రాబోయే రోజుల్లో వీరికి సంబంధించిన అనేక విషయాలు మరింతగా వెలుగులోకి రావాలంటే.. సీబీఐ విచారణ తప్పదని మంత్రి అయ్యన్న అంటున్నారంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. దీంతోనే చంద్రబాబు … రాబోయే ఎన్నికల్లో మంత్రి గంటాను తప్పించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.