చంద్రబాబు సార్.. కవిత కామెంట్లు విన్నారా?!

ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో అవ‌స‌ర‌మైతే కొడుకును సైతం వ‌దులుకుంటాను కానీ.. హోదాను మాత్రం వ‌దులుకునేది లేద‌ని పెద్ద ఎత్తున కామెంట్ల‌తో విరుచుకుప‌డిన సీఎం చంద్ర‌బాబు ఆ త‌ర్వాత అనూహ్యంగా ఈ విష‌యంలోపై వెన‌క్కి త‌గ్గారు. మొదట అస‌లు ఐదేళ్లు హోదా స‌రిపోద‌ని పేర్కొంటూ దానిని క‌నీసం ప‌దిహేనేళ్లు ఇవ్వాల్సిందేన‌న్నారు. విభజ‌న‌తో అల్లాడుతున్న రాష్ట్రానికి హోదాయే అన్నీ అందిస్తుంద‌ని, ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తాయ‌ని, ల‌బ్ధి చేకూరుతుంద‌ని ఆయ‌న పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. అయితే, ఓటుకు నోటు కేసు త‌ర్వాత ఈ హోదాపై ఎందుకో చంద్ర‌బాబు పూర్తిగా వెన‌క్కి త‌గ్గార‌నే ప్ర‌చారం ఉంది.

ఏదేమైనా.. ఇప్పుడు కేంద్రం ఇచ్చిన ప్ర‌త్యేక ప్యాకేజీకి చంద్ర‌బాబు అండ్ కో జైకొట్టి.. ప్యాకేజీని ఒడిసి ప‌ట్టి.. హోదా కోరుతున్న‌వారిపై మొట్టికాయ‌లు మొట్టుతోంది! అస‌లు హోదా గురించి ఆప‌కుండా.. ఆగ‌కుండా అర‌గంట పాటు ఏక‌బిగిన దంచి కొట్టిన చంద్ర‌బాబు ఇప్పుడు హోదా అంటే ఏంటో చెప్పాలంటూ ప్లేట్ ఫిరాయించారు. దీనిపై ఎవ‌రైనా మాట్లాడినా.. విమ‌ర్శించినా.. వాళ్ల‌పై రాష్ట్ర అభివృద్ధి వ్య‌తిరేకులు అనే ముద్ర వేసేస్తున్నారు. అయితే, అనూహ్యంగా ఏపీని విమ‌ర్శించి.. నానా బూతులు తిట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ క‌విత మాత్రం బాబుకు షాక్‌ ఇచ్చే నిర్ణ‌యం వెల్ల‌డించారు.

ఏపీ రాజ‌ధాని ప్రాంతం విజ‌య‌వాడ‌లో శుక్ర‌వారం ప్రారంభ‌మైన మ‌హిళా పార్ల‌మెంటేరియ‌న్ల స‌మావేశానికి క‌విత హాజ‌రైంది. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె… ఏపీకి హోదాపై స్పందించారు. ఏపీకి హోదా ఇవ్వాల్సిందేన‌ని అన్నారు.  ’ప్రజలు కోరుకుంటున్న వాటిని అందించాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుంది. ఏపీకి ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోవాలి. ఆంధ్ర ప్రజలకు మేము అండగా ఉంటాము. రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగువారిగా కలిసి ఉండాలి’ అన్నారు. మ‌రి ఇప్ప‌టికైనా సీఎం బాబు గారికి జ్ఞానోద‌యం క‌లుగుతుందో లేదో చూడాలి.