చెవిరెడ్డి వ్యూహంతో బాబుకు ఉద్యోగులు దూరం!!

వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి ఇటీవ‌ల కొన్ని రోజులుగా వ‌రుస‌గా ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పై రెచ్చిపోతున్నాడు. వైసీపీ ప్ర‌భుత్వం వ‌స్తే.. టీడీపీతో అంట‌కాగి, వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ఇబ్బందులు పెట్టిన వారిని త‌రిమి త‌రిమి కొడ‌తామ‌ని తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించారు. ఈ విష‌యంలో ఉద్యోగ సంఘాల నేత‌లు బొప్ప‌రాజు వంటి వారు తీవ్రంగానే స్పందించారు. ఈ వ్యాఖ్య‌లు తీవ్రంగా ఉన్నాయ‌ని క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఒక ర‌కంగా వైసీపీ వ్య‌తిరేక ప‌క్షాల‌ను ప్రోత్స‌హించే ప‌త్రిక‌లు సైతం చెవిరెడ్డి వ్యాఖ్య‌ల‌ను ప్ర‌ముఖంగా ఫ‌స్ట్ పేజీల్లో ప్ర‌చురించాయి.

ఇది ఒక ర‌కంగా వైసీపీకి మైన‌స్ అవుతుంద‌ని, ఉద్యోగ వ‌ర్గాలు ఆ పార్టీకి దూరం అవుతాయ‌ని ఈ వ‌ర్గాలు భావించాయి. ఈ నేప‌థ్యంలో ఉద్యోగ వ‌ర్గాలు క్ష‌మాప‌ణ‌ల కోసం ప‌ట్టుబ‌ట్ట‌డ‌మే కాకుండా చెవిరెడ్డి నాలుక కోస్తాం అంటూ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేశాయి. దీంతో చెవిరెడ్డి మెత్త‌బ‌డ‌తాడ‌ని అంద‌రూ భావించారు. కానీ, అనూహ్యంగా చెవిరెడ్డి త‌న వాయిస్ ప‌వ‌ర్‌ని మ‌రింత‌గా పెంచాడు. త‌న నాలుక కోసేవాళ్ల‌కి.. తాను అన్నీ కోస్తాన‌ని కౌంట‌ర్ కామెంట్ల‌తో అదిరిపోయేలా మాట్లాడాడు. అంతేకాదు, రాష్ట్రంలో ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల‌ను వెల్ల‌డిస్తూ.. ఉద్యోగ సంఘాలు చంద్ర‌బాబు కు ఎందుకు వంత పాడుతున్నాయ‌ని ప్ర‌శ్నించాడు.

దీంతో ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేత‌లు ఏం చేయాలో తెలియ‌క మౌనం పాటిస్తున్నాయి. ఒక ర‌కంగా చెవిరెడ్డి ఇలా మొండిగా ఉద్యోగ సంఘాల నేత‌ల‌పై విరుచుకుప‌డ‌డం వెనుక.. వైసీపీ వ్యూహం ఉంద‌నే టాక్ వ‌చ్చింది. ఉద్యోగులు చంద్ర‌బాబుకు తొత్తులుగా మారార‌ని, ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్ల‌డం ద్వారా వారిపై ప్ర‌జ‌ల్లో ఏవ‌గింపు క‌లిగేలా, ఆలోచ‌న వ‌చ్చేలా చేయాల‌న్న వైసీపీ వ్యూహం స‌క్సెస్ అయింద‌ని అంటున్నారు. ఇది నిజ‌మే అయితే, ఇక మీద‌ట‌.. బాబుకు ఉద్యోగులు దూరం అవుతార‌ని ఊహించ‌వ‌చ్చు!!