గుంటూరు వేదికగా ఆదివారం కాంగ్రెస్ నిర్వహించనున్న హోదా కోసం సభకు పెద్ద ఎత్తున ఇంకా చెప్పాలంటే హోదా కన్నా ఎక్కువగానే ప్రచారం చేస్తున్నారు. దీనికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా హాజరవుతున్నారు. దాదాపు 2019 ఎన్నికల నాటికి హోదా ను పెద్ద సెంటిమెంట్ అంశం చేసేసి.. ఏపీ ప్రజల ఓట్లు కొల్లగొట్టాలని కాంగ్రెస్ స్ఠానిక నేతలు పెద్ద స్కెచ్ సిద్ధం చేశారు. అందుకే హోదా కోసం పోరు పేరుతో అన్ని పార్టీల వారినీ ఏకం చేయాలని డిసైడ్ అయ్యారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇప్పుడు పవన్, జగన్ పేర్లను కూడా వాడేసుకుంటోంది. నిజానికి వీరిద్దరూ ప్రత్యేక హోదా కోసం పెద్ద ఎత్తున కామెంట్లు చేయడం, ఆందోళనలకు మద్దతివ్వడం, జగన్ అయితే, నేరుగా విశాఖలో ఆందోళనకు మద్దతివ్వడం తెలిసిందే. విశాఖ ఎయిర్పోర్టులో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దీంతో ఏపీ హోదా కోసం ఈ ఇద్దరు నేతలను వాడుకుంటే కాంగ్రెస్కు మద్దతు పెరుగుతుందని నేతలు ఆశపెట్టుకున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైన నేపథ్యంలో ఏపీలో ఏదో ఒక విధంగా మకాం వేయాలని డిసైడ్ అయింది. దీనికి హోదా పేరుతో ఆదివారం నిర్వహించే సభను అడ్డుపెట్టుకోవాలని నిర్ణయించుకుంది. అదేసమయంలో జగన్, పవన్ల పేర్లను కూడా వాడుకోవాలని నిర్ణయించింది. అయితే, ఇప్పటికే బీజేపీతో చెలిమికి చేతులు చాచిన జగన్.. ఇప్పుడు హోదా కోసం జరిగే పోరులో పాల్గొంటాడా? అదీకాక.. తన సీఎం కలలకు గండికొట్టిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ పాల్గొనే సభకు మద్దతిస్తాడా? అనేది నూరు డాలర్ల ప్రశ్న. అదేవిధంగా పవన్.. కూడా కాంగ్రెస్కు ఎంత మేరకు మద్దతిస్తాడనేది పెద్ద ప్రశ్న. ఏదైమైనా.. పవన్, జగన్ లకు ఆహ్వానం పలకడం ఆసక్తిగా మారింది.