గత కొన్నాళ్లుగా ఏపీలోని తెలుగు దినపత్రికల్లో.. ఏసీబీకిన ఇంజనీర్. ఏసీబీకి చిక్కిన డీటీసీ.. ఏసీబీకి చిక్కిన ఎంఆర్వో.. ఇలా రోజూ ఏదో ఒక అవినీతి వార్త కనిపిస్తూనే ఉంది. పోనీ దీనీని లైట్గా తీసేద్దామా? అంటే.. అలా పట్టుబడిన వారి నుంచి ఏసీబీ స్వాధీనం చేసుకుంటోంది ఏ వేలో లక్షలో కావు.. పదులు.. వందల కోట్లు!! కిలోలకు కిలోలు బంగారం, వెండి వస్తువులు. ఖరీదైన ఫర్నిచర్.. ఫారిన్ లిక్కర్ బాటిళ్లు!! మరి ఇంతలా అవినీతి నిత్యం పారుతున్న వెలుగు చూస్తున్న రాష్ట్రం బహుశ దేశంలో ఏపీ ఒక్కటే నేమో అని విమర్శకులు అంటున్నారు.
ఇక, సీఎం చంద్రబాబు పరిస్థితి చూస్తూ.. ఆయన అవినీతిపై పోరాటం అంటున్నారు. అంతేకాదు, ప్రజల చేతికే బ్రహ్మాస్త్రం అంటూ 1100 టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ను కూడా ప్రకటించేశారు. దీనికి కాల్ చేస్తే.. అవినీతి భరతం పడతామని, వసూలు చేసిన మొత్తాన్ని వెనక్కి రాబడతామని చెబుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. నోట్ల రద్దుతో అవినీతి అంతమై పోతుందని కేంద్రం చెబితే ఏమోనిజమేనేమో అనుకున్నారు జనాలు! అది నేతిబీరకాయ చందంగా మారిపోయింది.
ఇక,ఇప్పుడు బాబు ప్రవేశ పెట్టిన నెంబర్ కూడా అలానే తయారైంది. చోటా అవినీతి రాయుళ్లను ఈ ఫోన్ పట్టిస్తోందేమో కానీ, కోట్లలో అవినీతికి పాల్పడుతున్న వారిని ఇది ఏమీ చేయలేకపోతోంది. తాజాగా విశాఖలో ఏసీబీ దాడులు చేసిన సబ్ రిజిస్ట్రార్ వెంకయ్యనాయుడు ఇంట్లో వైభోగం చూసేందుకు రెండు కళ్లూ చాలలేదు. నిజానికి ఇంత అవినీతికి ఆయనొక్కడే పాల్పడ్డాడా? అంటే అనుమానమే.
పై అధికారుల అండ, అభయం, భాగం లేకుండా ఈయనొక్కడే అన్ని కోట్లు వెనుకేసుకున్నాడా? ముమ్మాటికీ అంత ధైర్యం ఉండదు. మరి ఏసీబీ అధికారులు ఆ పైవాళ్లను ప్రశ్నించే ధైర్యం చేస్తారా? అలా చేస్తే.. అసలు బండారం బయట పడుతుంది. మరి సీఎంగారు ఇలాంటి విషయాల్లో మౌనంగా ఉంటూ.. పైపైకి ఎన్ని ఫోన్లు ప్రకటించినా ప్రయోజనం ఏంటి?!!