ఉన్నది ఉన్నట్టు చెప్పడం..చూసింది చూసినట్టు వివరించడం జర్నలిజం లక్షణం. దీనికి ఏదైనా వ్యాఖ్య చేయాలనుకుంటే.. దానికి ఎలాగూ ఎడిటోరియల్ పేజీ అని పూర్తిగా ఓ పేజీ ఉండనే ఉంది. కాబట్టి ఏం జరిగినా.. జరింది జరిగినట్టు ప్రజలకు చెప్పడమే పత్రికల విధి!! ఇది కొన్ని దశాబ్దాల కిందటి మాట! కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఏ వార్తను ప్రచురించినా.. దానిలో తమ ప్రయోజనం, తమ వర్గం ప్రయోజనం, తమపార్టీ అజెండా ప్రయోజనం ఇవే చూసుకుంటున్నాయి పత్రికలు!
ఇప్పడు ఈ విషయం ఎందుకంటే.. ఆదివారం గుంటూరు వేదికగా కాంగ్రెస్ నిర్వహించిన ప్రత్యేక హోదా సభ పైనే ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఈ సభ కొంతలో కొంత హిట్! ఇందులో సందేహం లేదు. నిర్జీవంగా ఉన్న కాంగ్రెస్కు ఓ బూస్ట్ బాటిల్ అందించి నట్టయింది. అయితే, ఈ సభను చూసిన కోణంలోనే అనేక మార్పులు చేర్పులు జరిగాయి. టీడీపీ అనుకూల పత్రికలు ఈ సభ విజయవంతమైందని రాయగా, జగన్ పత్రిక మాత్రం రాహుల్ సభ ఫ్లాప్ అయిందని రాసింది.
ఇలా రాయడానికి రెండు పత్రికలకు వచ్చే 2019 ఎన్నికలే కారణంగా కనిపిస్తున్నాయి. జగన్కు మద్దతిచ్చే పత్రిక.. కాంగ్రెస్ సభకు ఏ ఒక్కరు రాలేదని పేర్కొనగా.. టీడీపీ అనుకూల పత్రికలు మాత్రం ఈ సభ పూర్తిగా హిట్టయిందని చాటుతున్నాయి. దీనికి ఏకైక కారణం.. జగన్కి కాంగ్రెస్ అనుకూల వర్గం మొదటి నుంచి మద్దతుగా ఉంది. కాంగ్రెస్ పుంజుకుందని వారికి తెలిస్తే.. జగన్కి వాళ్లు గుడ్బై చెప్పి తిరిగి కాంగ్రెస్లోకి వచ్చేస్తే.. జగన్ బలం తగ్గి.. బాబు తిరిగి సీఎం అయిపోతాడని వాటి ప్లాన్.
ఇక, జగన్ పత్రిక విషయానికి వస్తే.. కాంగ్రెస్ సభను ఫ్లాప్ అయిందని చెబతేకానీ ఇక్కడ వర్కవుట్ అయ్యే పరిస్థితి కనిపించదు. సభ ఫ్లాప్ అయితే, తమ తో ఉన్న కాంగ్రెస్ వర్గం ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ తమ వద్దే ఉంటుందని ఫలితంగా 2019లో అధికారం కైవసంచేసుకోవచ్చని ఆలోచన. సో… ఇలా ఎవరికి వారే ఈ వార్ను ఓన్ చేసుకునేందుకు యత్నిస్తున్నారన్నమాట. అయితే, 2019లో ఎవరి గెలుపు ఎలా ఉంటుందో చూడాలి.